ఉద్యోగులపై కక్ష సాధింపు చర్యలా?
- సచివాలయ ఉద్యోగులపై ఏపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేపడుతోందా?
- వరుసగా ఇద్దరు ఉద్యోగులపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేయడంతో అనుమానాలు మరింత బలపడుతున్నాయి.
- దీంతో సచివాలయ ఉద్యోగుల్లో ఆందోళన పెరుగుతోంది.
సచివాలయ ఉద్యోగులపై ఏపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేపడుతోందా? పరిస్థితులను చూస్తుంటే అవుననే సమాధానమే వినపడుతోంది. వరుసగా ఇద్దరు ఉద్యోగులపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేయడంతో అనుమానాలు మరింత బలపడుతున్నాయి. దీంతో సచివాలయ ఉద్యోగుల్లో ఆందోళన పెరుగుతోంది.
అసలేం జరిగిందంటే.. జీవో కాపీలను లీక్ చేశారంటూ గత కొద్ది రోజుల క్రితం న్యాయశాఖ సెక్షన్ ఆఫీసర్ తిమ్మప్పను సస్పెండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులను 50 ఏళ్లకే ఇంటికే ప్రతిపాదనకు సంబంధించిన జీవో అది. దానిని లీక్ చేశారనే.. తాజాగా మరో అధికారి వెంకట్రామిరెడ్డిని బుధవారం సస్పెండ్ చేశారు.
అయితే.. కొంత కాలం క్రితం.. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ కాలం 50కి తగ్గిస్తున్నారంటూ వార్తలు వెలువడ్డాయి. దీనిపై మీడియా.. ప్రభుత్వాన్ని ప్రశ్నించగా..అవన్నీ పుకార్లంటూ కొట్టిపారేశారు. తమకు అసలు అలాంటి ఆలోచనే లేదని చెప్పుకొచ్చారు. అలాంటిది.. ఇప్పుడు..లేని జీవో కాపీలీక్ అయ్యిందంటూ అధికారులపై చర్యలు తీసుకోవడం విచిత్రంగా ఉంది. దీనిపై ఉద్యోగులు తీవ్ర స్థాయిలో స్పందిస్తున్నారు. కావాలనే ప్రభుత్వం తమపై కక్ష సాధింపు చర్యలు చేపడుతోందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉండగా.. ఇటీవల జరిగిన సచివాలయ ఉద్యోగుల ఎన్నికల్లో వెంకట్రామి రెడ్డి అధ్యక్ష పదవికి పోటీ చేశారు. ఆ విషయంలో పోటీ నుంచి తప్పుకోవాలని వెంకట్రామిరెడ్డిని ఇంటికి పిలిచి సీఎం వార్నింగ్ ఇచ్చారని.. అయినా వినకుండా ఆయన పోటీ చేశారు. ఈ విషయంలోనే వెంకట్రామిరెడ్డి ఉద్యోగం నుంచి తొలగించారనే ప్రచారం జరుగుతోంది.