ఏపీ, తెలంగాణ అధికారుల మధ్య నీటి చిచ్చు
నాగర్జునసాగర్ వద్ద ఇరు రాష్ట్రాల ఇంజనీర్ల మధ్య వాగ్వివాదం, ఉద్రిక్తంగా మారిన పరిస్థితి.
విభజన సమస్యలు ఇంకా రెండు రాష్ట్రాల మధ్య చిచ్చు పెడుతూనే ఉన్నాయి.
రాష్ట్ర పునర్ విభజన చట్టం ప్రకారం ఇరు రాష్ట్రాల మధ్య కేటాయింపులు చేయడంలో కేంద్రం చొరవ తీసుకోకపోవడంతో పరిస్థితి మరింత జటిలం అవుతోంది.
ఉద్యోగుల విభజన, నీటి పంపకాలు, భవనాల కేటాయింపు పై రెండు రాష్ట్రాల మధ్య కీచులాటలు తప్పడం లేదు.
తాజాగా నాగార్జున సాగర్ డ్యాం రెండు రాష్ట్రాల అధికారుల మధ్య ఉద్రిక్తతకు దారితీసింది.
ఆంధ్రప్రదేశ్ నీటి విడుదలను అడ్డుకునేందుకు తెలంగాణ ఇంజినీర్లు ప్రయత్నించారని ఏపీ అధికారులు ఆరోపించడంతో సాగర్ డ్యాం వద్ద గొడవలు మొదలయ్యాయి.
తమకు కేటాయించిన నీటి విడుదల కొనసాగించాలని ఏపీ ఇంజనీర్లు పట్టుబట్టడంతో ఇరు రాష్ట్రాల అధికారుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
ఆంధ్రప్రదేశ్కు కేటాయించిన మొత్తం 17 టీఎంసీల్లో 13 టీఎంసీలు మాత్రమే తాము వాడామని ఇంకా 4 టీఎంసీల నీటిని తమకు విడుదల చేయాలని ఏపీ ఇంజనీర్లు వాదిస్తుండగా, అదేం లేదని 17 టీఎంసీలు ఏపీ వాడిందని తెలంగాణ ఇంజినీర్లు స్పష్టం చేశారు.
ఇరు రాష్ట్రాల అధికారులతో వాగ్వివాదంతో అక్కడ పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగానే ఉంది.
సాగర్ వద్ద ఇరు రాష్ట్రాల అధికారుల మధ్య గొడవలు జరగడం కొత్తేమీ కాదు. గత రెండున్నరేళ్లుగా అనేక సార్లు నీటి పంపకాల విషయమై ఇరు రాష్ట్రాల అధికారుల మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి.