చంద్రబాబు ప్రభుత్వంపై కోర్టులో కేసు
- చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టులో కేసు దాఖలైంది.
- సీఎంవో కార్యాలయ పనితీరు సరిగా లేదని.. దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి(సీఎస్) ఐవైఆర్ కృష్ణారావు కోర్టును ఆశ్రయించారు
చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టులో కేసు దాఖలైంది. సీఎంవో కార్యాలయ పనితీరు సరిగా లేదని.. దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి(సీఎస్) ఐవైఆర్ కృష్ణారావు కోర్టును ఆశ్రయించారు. సీఎంవో పారదర్శకంగా పనిచేసేందుకు ఓ నిర్ధిష్ట విధానాన్ని రూపొందించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించారు.
సీఎంవో పనితీరు సమర్థవంతంగా, బాధ్యతాయుతంగా, ప్రజల విషయంలో తక్షణమే స్పందించేందుకు వీలుగా ఏపీ సెక్రటేరియట్ ఆఫీస్ మాన్యువల్, ఏపీ బిజినెస్ రూల్స్ కు సవరణలు చేసేలా ఆదేశాలివ్వాలని కోరారు.ఈ సవరణలు సీఎంవోకు వర్తింపచేసేలా ఆదేశాలు జారీ చేయాలన్నారు. ఈ వ్యాజ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని ప్రతివాదులుగా చేర్చారు.
సీఎంవో అధికారులు నిర్ధిష్టమైన విధానాన్ని అనుసరించడంలేదని, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఇది ప్రజా ప్రయోజనాలకు విరుద్ధమని.. అందుకే సీఎంవోని నియంత్రించే వ్యవస్థ ఏర్పాటు చేయాలని న్యాయస్థానానికి విన్నవించారు. సీఎంవో పనితీరు తెలుసుకునేందుకు ఇటీవల తాను సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసుకుంటే.. వారి దగ్గర నుంచి ఎలాంటి సమాధానం రాలేదని చెప్పారు. కేవలం ఒక రికార్డునుకూడా సమాచార హక్కు చట్టం అందించలేకపోయిందని.. దీనిని బట్టి అక్కడ రికార్డులు నిర్వహించడం లేదన్న విషయం అర్థమౌతోందని ఆయన అన్నారు.