విహెచ్ కు ఆంధ్రా బహిష్కరణ
- తెలంగాణా కాంగ్రెస్ నాయకుడు విహెచ్ కు ముద్రగడ సెగ
- మొదట పశ్చిమ గోదావరి జిల్లా నుంచి తరిమేసిన పోలీసులు
- ఇపుడు ఆంధ్రా నుంచి వెళ్లిపోమ్మంటున్నారు
- హక్కులు కాలరాస్తే ఆత్మహత్యకు కూడా వెనకాడను
తెలంగాణా కాంగ్రెస్ నాయకుడు ,మాజీ రాజ్యసభ సభ్యుడు విహనుమంతరావును ఆంధ్ర విడిచి వెళ్లిపొమ్మన్నారు. కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం రేపటి కాపు యాత్ర పురష్కరించుకుని, కాపుల మీద విధిస్తున్న నిర్బంధం రీత్యా ఆంధ్రపోలీసుల ఆయనను విజయవాడ విడిచివెళ్లిపొమ్మన్నారు. వెళ్లిపోక పోతే, బలవంతంగా పంపిస్తామని పోలీసులు చెబుతున్నారని ఈ వార్త రాస్తున్నపుడు విజయవాడ ఐలాపురం హోటల్ ఉన్న హనుమంతరావు ఎషియా నెట్ కు తెలిపారు.
ఐలాపురం హోటల్ చుట్టూ పోలీసు కాపలా పెట్టారు. వి హనుమంతారావు తెలంగాణా కు చెందిన మున్నూరు కాపు నాయకుడు.
నిజానికి ఆయనను పశ్చిమ గోదావరి జిల్లానుంచి వెళ్లిపొమ్మన్నారు. ఆయన మొండి కేయడంతో రాత్రి ఆయనను రాజమండ్రి నుంచి విజయవాడ తీసుకువచ్చి ఈ హోటల్ నిర్బంధించారు.
హోటల్ ఐలాపురం నుంచి ఆయన ఏషియానెట్ మాట్లాడుతూ తాను కాపు ఉద్యమంలో పాల్గొనేందుకు రాలేదని, కేవలం గరగపర్రు దళితులను పరామర్శించేందుకే వచ్చానని చెప్పినా పోలీసులు వినలేదని ఆయన వెల్లడించారు.
‘రాజమండ్రి ఆనంద్ రెసిడెన్సీలో నేను బస చేయాల్సి ఉండింది. అయితే, పెద్ద ఎత్తున పోలీసుల వచ్చిన నన్ను ఆపారు. నా కారు తాళం చెవి కూడా తీసుకుని పోలీసు డ్రైవర్ సహాయంతో నన్ను విజయవాడ తీసుకు వచ్చి ఈ హోట్లల్ లో వేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో నేను ఉండటానికి వీల్లేదని ఎస్ పి గారి అదేశమని పోలీసులు చెబుతున్నారు,’ అని హనుమంతరావు చెప్పారు.
నేను ఆంధ్రా వదలి పోవాలని మంగళవారం పొద్దునే పోలీసుల చెప్పారని, ఇది అన్యాయమని రావు చెప్పారు.
గరగపర్రులో సాంఘిక బహిష్కరణకు గురయిన దళితులను ఎవ్వరూ పట్టించుకోవడం లేదని, వారికి తిండికూడా దొరకని పరిస్థితి వచ్చిందని చెబుతూవారికి కొంత సహాయం చేసేందుకే తాను ఆ ఊరు వెళ్లానని హనుమంతరావు చెప్పారు.
అంబేద్కర్ విగ్రహం నిలబెట్టాలనుకున్న దళితులకు ఇంత శిక్ష విధిస్తారా అని రావు ప్రశ్నించారు. దీని కంతటికి కారణం తెలుగుదేశానికి చెందిన స్థానిక అగ్రవర్ణ నాయకులేనని ఆయన ఆరోపించారు
‘ రాష్ట్ర బహిష్కరణ విధించేందుకు నేను తీవ్రవాదిని కాదు. గజదొంగని కాదు. మాజీ పార్లమెంటు సభ్యుడిని. రేపటి దాకా విజయవాడలోనే ఉంటాను. ఏమి చేస్తారో చేయడి,’ అని మొండికేశారు.