ఎయిర్ టెల్.. వినియోగదారుల కోసం మరో బంపర్ ఆఫర్ ని ప్రకటించింది.

వినియోగదారులను ఆకట్టుకునేందుకు టెలికాం సంస్థలు పోటీపడుతున్నాయి. ఒకదానిని మించి మరొకటి ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. తాజాగా ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్ టెల్.. వినియోగదారుల కోసం మరో బంపర్ ఆఫర్ ని ప్రకటించింది. ఇప్పటికే రిలయన్స్ జియో.. వినియోగదారులను ఆకట్టుకునేందుకు విభిన్న ఆఫర్లను ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా.. జియో తాకిడిని తట్టుకునేందుకు ఎయిర్ టెల్ కూడా ఆఫర్లు ప్రకటిస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా మరో ఆఫర్ ని వినియోగదారుల ముందుకు తీసుకువచ్చింది.

ఇటీవల జియో.. రూ.98తో ప్రీపెయిడ్ రీఛార్జ్ ఆఫర్ ని తీసుకువచ్చింది. కాగా.. దీనికి పోటీగా ఎయిర్ టెల్ రూ.93తో ప్రీపెయిడ్ రీఛార్జ్ ఆఫర్ ని ప్రకటించింది. రూ.93తో రీఛార్జ్ చేసుకుంటే..  10 రోజుల వ్యాలిడిటీతో 1జీబీ డేటా అందిస్తుంది. దీంతో పాటు అపరిమిత లోకల్‌, ఎస్టీడీ కాల్స్‌, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు ఇస్తుంది. జియో కూడా రూ. 98కి 14 రోజుల వ్యాలిడిటీతో 2.1జీబీ డేటా అందిస్తోంది. అయితే జియోలో రోజుకు 0.15జీబీ డేటా పరిమితి ఉండగా.. ఎయిర్‌టెల్‌లో ఎలాంటి పరిమితులు లేవు.

తక్కువ వ్యాలిడిటీలో డేటా ఆఫర్లు కావాలనుకునే వినియోగదారుల కోసం ఈ ఆఫర్‌ను తీసుకొచ్చినట్లు ఎయిర్‌టెల్‌ తెలిపింది. మరోవైపు టెలికాం సంస్థ వొడాఫోన్‌ కూడా తక్కువ వ్యాలిడిటీతో ప్రీపెయిడ్‌ ఆఫర్‌ తీసుకొచ్చింది. రూ. 46కే ఏడు రోజుల వ్యాలిడిటీటో 500 ఎంబీ 4జీ డేటా అందిస్తోంది.