ధర తగ్గిన ఎయిర్ టెల్ 4జీ హాట్స్పాట్
- వినియోగదారులను మరింత ఆకట్టుకునే ఉద్దేశంతో ఎయిర్ టెల్ హాట్ స్పాట్ ధర తగ్గించింది.
- కేవలం రూ.999కే అందిస్తున్నట్లు ప్రకటించింది.
ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్ టెల్ 4జీ హాట్స్పాట్ పోర్టబుల్ డివైజ్ వై-ఫై ధర తగ్గింది. వినియోగదారులను మరింత ఆకట్టుకునే ఉద్దేశంతో ఎయిర్ టెల్ హాట్ స్పాట్ ధర తగ్గించింది. కేవలం రూ.999కే అందిస్తున్నట్లు ప్రకటించింది.ఎయిర్టెల్ 4జీ హాట్స్పాట్, మల్టిపుల్ డివైజ్లకు కనెక్ట్ చేసుకునే సౌకర్యం ఉంది. స్మార్ట్ ఫోన్లు, ల్యాప్టాప్ల నుంచి టాబ్లెట్లు, స్మార్ట్ టీవీల వరకు దీన్ని కనెక్ట్ చేసుకోవచ్చు. ఇది రిలయన్స్ జియో అందిస్తున్న జియోఫై ఎం2ఎస్ 4జీ హాట్స్పాట్కు గట్టి పోటినిస్తోంది.
గతంలో దీని ధర రూ.1500 ఉండగా రూ.501తగ్గించి రూ.999కే అందజేస్తున్నారు.. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఎయిర్టెల్ రిటైల్ స్టోర్లలో ఈ ఆఫర్ వర్తిస్తుందని కంపెనీ ప్రకటించింది. అమెజాన్ ఇండియా నుంచి కూడా కస్టమర్లు దీన్ని త్వరలోనే ఆర్డర్ చేసుకోవచ్చని పేర్కొంది. రిలయన్స్ జియో తన జియోఫై ఎం2ఎస్పై ధర తగ్గించిన తర్వాత మూడు నెలల వ్యవధిలోనే ఎయిర్టెల్ కూడా తన పోర్టబుల్ డివైజ్ను తగ్గింపు ధరలో అందుబాటులోకి తెచ్చింది.
ఈ డివైజ్ పనిచేయడానికి ఎయిర్టెల్ సిమ్ కార్డు కావాల్సి ఉంటుంది. మొబైల్ ఫోన్లలో సిమ్ కార్డుకు రీఛార్జ్ చేసిన మాదిరిగా దీనికి కూడా రీఛార్జ్ చేయించాల్సి ఉంటుంది. ఒకవేళ ఎయిర్టెల్ 4జీ నెట్వర్క్ అందుబాటులో లేకపోతే, ఈ హాట్స్పాట్ 3జీ నెట్వర్క్లోకి మారిపోతుంది. ఒకేసారి 10 డివైజ్ల వరకు కనెక్ట్ చేసుకోవచ్చు. ఆరు గంటల వరకు దీన్ని బ్యాటరీ లైఫ్ ఉంటుంది.