కస్టమర్ల పట్ల దారుణంగా ప్రవర్తిస్తున్న ఎయిర్ సెల్
- సిగ్నల్ టవర్స్ ని తొలగించిన ఎయిర్ సెల్
- సిగ్నల్ రాక ఇబ్బంది పడుతున్న కస్టమర్లు
ప్రముఖ టెలికాం సంస్థల్లో ఎయిర్ సెల్ కూడా ఒకటి. ఎయిర్ టెల్, జియో, ఐడియా సిమ్ లను ఉపయోగించేవారితో పోలిస్తే.. ఎయిర్ సెల్ సిమ్ ని వాడే వారి సంఖ్య చాలా తక్కువ. అయినప్పటికీ.. కొందరు ఎయిర్ సెల్ ని వాడుతూనే ఉన్నారు. ఉన్న కస్టమర్లకు మెరుగైన సేవలు అందించాల్సింది పోయి.. ఎయిర్ సెల్ సంస్థ వారి పట్ల దారుణంగా ప్రవర్తిస్తోంది.
ప్రస్తుతం ఎయిర్ సెల్ సిమ్ ని వినియోగిస్తున్నవారు సంస్థ కారణంగా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్ నగరంలోని కస్టమర్లకు కనీసం సిగ్నల్ కూడా అందడం లేదు. పోనీ.. నెంబర్ పోర్టబుల్ పెట్టుకొని వేరే నెట్ వర్క్ కి మారదామన్నా.. ఆ సౌలభ్యం కూడా ఇవ్వకపోవడం గమనార్హం. ఓ అనధికారిక సమాచారం ప్రకారం, హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో ఎయిర్ సెల్ తన టవర్లను ఇప్పటికే తొలగించింది. అందుకే చాలామందికి సిగ్నల్ రావట్లేదు. బెంగళూరు, పశ్చిమబెంగాల్, ముంబాయి, కర్ణాటక రాష్ట్రాల్లో అనేక ప్రదేశాల్లో దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. దీనిపై కష్టమర్లు ఫిర్యాదు చేసినా స్పందించకపోవడం గమనార్హం.