బస్సు టికెట్ కన్నా తక్కువ ధరలో విమాన టికెట్లు
- పండగల కారణంగా వీళ్లు ఛార్జీలు పెంచుతుంటే.. విమానాయన సంస్థలు మాత్రం ధరలు తగ్గించేశాయి.
- ఈ పండగ సీజన్ లో బస్సులో వెళ్లడం కంటే.. విమానంలో వెళ్లడం చాలా సులభమని అనిపించేలా ధరలు తగ్గించారు.
సంక్రాంతి ఎఫెక్ట్.. బస్సు, రైలు ఛార్జీలపై స్పష్టంగా కనపడుతోంది. సంక్రాంతి సెలవలకు దాదాపు అందరూ ఊళ్లకు పయనమవుతారు కాబట్టి.. ఆర్టీసీలు, ప్రైవేటు బస్ సర్వీసులు ఛార్జీలు భారీగా పెంచేశాయి. అయితే.. పండగల కారణంగా వీళ్లు ఛార్జీలు పెంచుతుంటే.. విమానాయన సంస్థలు మాత్రం ధరలు తగ్గించేశాయి. ఈ పండగ సీజన్ లో బస్సులో వెళ్లడం కంటే.. విమానంలో వెళ్లడం చాలా సులభమని అనిపించేలా ధరలు తగ్గించారు. టికెట్ ధరలపై డిస్కౌంట్లు ప్రకటించిన వాటిలో ‘ గో ఎయిర్’, ‘ఇండిగో’, ‘ఎయిర్ ఏసియా’ సంస్థలు ఉన్నాయి.
‘ గో ఎయిర్’ సంస్థ.. డొమెస్టిక్ విమానాల టికెట్లపై ఆఫర్లు ప్రకటించింది. జనవరి 11వ తేదీ వరకు ఈ ఆఫర్లు వర్తిస్తాయని చెప్పింది. అంతేకాదు ‘గో ఎయిర్’ మొబైల్ యాప్ నుంచి మీరు టికెట్లు బుక్ చేసుకుంటే.. ‘గోయాప్10’ అనే ప్రోమోకోడ్ లభిస్తుంది. ద్వారా టికెట్ పై మరో 10శాతం డిస్కౌంట్ లభిస్తుంది. చెన్నై- కొచ్చి, గౌహతి-బగ్డోగ్రా, ముంబయి- అహ్మదాబాద్, బెంగళూరు-హైదరాబాద్, బెంగళూరు-పూణె, ఢిల్లీ- లక్నో, పూణె- అహ్మదాబాద్ రూట్ విమాన సర్వీసులకు ఆఫర్లు ప్రకటించింది. విమాన టికెట్ రూ.1005 నుంచి ప్రారంభం కానుంది.
‘ఇండిగో’ సంస్థ కూడా విమాన టికెట్లపై ఆఫర్లు ప్రకటించింది. న్యూ ఇయర్ సేల్ లో భాగంగా.. టికెట్ల ధరలను తగ్గించింది. ఏప్రిల్ 15వ తేదీ వరకు ఈ సేల్ వర్తిస్తుందని సంస్థ తమ వెబ్ సైట్ లో ప్రకటించింది. విమాన టికెట్ ప్రారంభధర రూ.899గా ప్రకటించింది. దేశరాజధాని ఢిల్లీ నుంచి ఇతర ప్రాంతాలకు ప్రయాణించే విమానాలకు ఈ ఆఫర్లు వర్తిస్తాయి.
‘ఎయిర్ ఏసియా’ సంస్థ తమ విమాన టికెట్ల ప్రారంభ ధర రూ.1599గా ప్రకటించింది. ఈ ఆఫర్ కూడా కేవలం డిమెస్టిక్ ఎయిర్ లైన్స్ కి మాత్రమే వర్తిస్తుంది. టికెట్ల అడ్వాన్స్ బుకింగ్ ఇప్పటికే ప్రారంభమైందని కంపెనీ తమ వెబ్ సైట్ లో తెలిపింది. భువనేశ్వర్,కలకత్తా, కొచ్చి, బెంగళూరు, హైదరాబాద్ ప్రాంతాలకు వెళ్లే విమానాలపై ఈ ఆఫర్లు ఉన్నాయి. ఈ ఆఫర్ బుకింగ్స్ జనవరి 14తో ముగుస్తాయి. ఈ ఆఫర్ సేల్ ముందుగా బుక్ చేసుకొని మే6వ తేదీ వరకు ప్రయాణించవచ్చు.