భన్వర్ లాల్ కి ఏపీ ప్రభుత్వం షాక్..!
- భన్వర్ లాల్ కి షాకిచ్చిన ఏపీ ప్రభుత్వం
- పదవీ విరమణ నాడే నోటీసులు జారీ చేసిన ప్రభుత్వం
- ప్రభుత్వ భవన దుర్వినియోగం కేసులో చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీచేసిన ప్రభుత్వం
తెలుగు రాష్ట్రాలకు ప్రధాన ఎన్నికల అధికారిగా పనిచేసిన భన్వర్ లాల్ కి ఏపీ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ప్రభుత్వ బంగ్లా దుర్వినియోగం కేసు కింద ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
అసలేం జరిగిందంటే.. రాష్ట్ర విభజన జరగకముందు 1996 నుండి 2000 సంవత్సర మధ్య కాలంలో హైదరాబాద్ నగరానికి భన్వర్ లాల్ కలెక్టర్ గా పనిచేశారు. ఆ సమయంలో ఆయనకు బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 13లోని 33నెంబరు క్వార్టరు కేటాయించారు .
2000 ఏడాది జులై లో ఆయనకు హైదరాబాద్ నుంచి వేరే ప్రాంతానికి బదిలీ అయింది. అయినప్పటికీ ఆయన భవనాన్ని ఖాళీ చేయకుండా అందులోనే కొనసాగారు. దీంతో భవనాన్ని ఖాళీ చేయాలంటూ అప్పటి ప్రభుత్వం ఆయనకు 2005లో ఆదేశాలు జారీ చేసింది..ఆ ఆదేశాలను ఆయన పాటించకపోవడంతో అప్పటి ఎస్టేట్ అధికారి 2006 మే లో బలవంతంగా స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా ఆయనకు రూ.17 .50 లక్షల జరిమానా కూడా విధించారు.
ఆ తర్వాత భన్వర్ లాల్ అభ్యర్థన మేరకు పెనాల్టీ మొత్తాన్ని కొంత తగ్గించి రూ.4,37లక్షలు చెల్లించాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు..మొత్తం ఎనబై ఎనిమిది వాయిదాలలో చెల్లించాలని సూచించారు. అయినప్పటికీ ఒక్క వాయిదా కూడా భన్వర్ లాల్ చెల్లించలేదు. కాగా ఆయన పదవీ విరమణ ముగిసే సమయానికి ఏపీ ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. ఇన్ని సంవత్సరాలుగా ఈ విషయం పట్టించుకోని ప్రభుత్వం.. ఆయన పదవీ విరమణ ముగిసే సమయానికి నోటీసులు జారీ చేయడం గమనార్హం.