టీవీ సిరియల్ కోసం అల్లున్ని చంపిన మామ
సీరియల్ కోసం మామ...ఐపిఎల్ కోసం అల్లుడు
చిన్న విషయంపై జరిగిన గొడవ ఓ వ్యక్తి ప్రాణాలను బలితీసుకున్న సంఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. టీవీ సిరియల్ కోసం కన్న కూతురి పసుపు కుంకుమలనే చెరిపేశాడో తండ్రి. తాను చూస్తున్న టీవిలో సిరియల్ చూస్తుండగా దాన్ని మార్చి ఐపిఎల్ క్రికెట్ మ్యాచ్ పెట్టుకున్నాడని సొంత అల్లున్నే చంపేశాడో మామ.
ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా బీర్కూ ర్ మండలంలోని బరంగ్ఎడ్గి గ్రామానికి చెందిన బుజ్జయ్య కూతురు అక్షిత. ఈమెను మంగటి వెంకటి(25) కి అనే యువకుడికిచ్చి వివాహం చేశారు. ఈ దంపతులకు ఒక కొడుకు ఒక కూతురు ఉంది. అయితే అక్షిత మళ్లీ గర్భవతిగా ఉండటంతో పురుడు కోసం పుట్టింటికి వెళ్ళింది. భార్య పుట్టింటికి వెళ్లి చాలా రోజులవడంతో ఆమెను చూడడానికని వెంకటి ఈ నెల తొమ్మిదవ తేదీన అత్తవారింటికి వెళ్లాడు. అయితే అదే రోజు సాయంత్రం సమయంలో టీవి చూసే విషయంలో మామా అల్లుళ్లకి గొడవ జరిగింది. టీవిలో తాను సిరియల్ చూస్తానని మామ...కాదు కాదు ఐపిఎల్ మ్యాచ్ చూస్తానని అల్లుడు గొడవపడ్డారు. ఇద్దరి మద్య మాటా మాటా పెరిగి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ క్రమంలో మామ కత్తెరతో అల్లుడిపై దాడి చేయగా అతడు తీవ్రంగా గాయపడ్డాడు. తీవ్ర రక్తస్రావంతో పడివున్న వెంకటిని హుటాహుటిన హైదరాబాద్ నిమ్స్ కు తరలించారు. అయితే ఐదు రోజులుగా కొన ఊపిరితో ఐసియూలో చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందాడు.
అల్లడిపై దాడికి పాల్పడి అతడి హత్యకు కారణమైన మామ బుజ్జయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేవలం టీవి చూసే విషయంలోనే గొడవ జరిగిందా? లేక మరేదైనా కారణం ఉందా? అన్న కోణంలో నిందితున్ని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.