ఆంధ్రా పోలీసుల కస్టడీలో 32 గోవుల మృతి
- అక్రమ రవాణా అంటూ అవుల ట్రక్కును నిలిపి వేసిన గో సంరక్షకులు
- లారీని అదుపులోకి తీసుకున్న పోలీసుల
- వర్షంలో, ఇరకు కంటైనర్ వూపిరాడక చనిపోయిన ఆవులు
గోసంరక్షణ దళాల ఉత్సాహం వికటించింది. అక్రమ రవాణాను అడ్డుకుని గోవులను రక్షాంచాలనుకున్నా, అజ్ఞానం అడ్డొచ్చి గోవుల ప్రాణాలు తీసింది. మనసును కలచి వేసే ఈ సంఘటన పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో జరిగింది.
దేవరపల్లి మండలం ఎర్నగూడెం దగ్గర బుధవారం ఉదయం 10 టైర్ల ట్రక్కులో 72 గోవులను అక్రమంగా తరలిస్తున్న స్థానిక గో సంరక్షణ సమితి కార్యకర్తలకు తెలిసింది. ఈ ఆవులు ఒడిశా నుంచి హైదరాబాద్కు తరలిస్తున్నట్లు చెబుతున్నారు. అంతే వారు, రెచ్చిపోయారు.లారీని నిలేశారు. స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. దీనితో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. లారీని అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి దేవరపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
అయితే, అదే ప్రమాదానికి దారి తీసింది. ఆవులను తరలిస్తున్న ట్రక్కులో సరపడే జాగా లేకపోవడంతో వాటికి ఉపిరాడని పరిస్థితి ఎదురయింది. దానికితోడు పెద్ద వర్షం. ఇలాగా అక్కడే రాత్రి 9 గంటల దాకా ఉన్నాయి. ఫలితంగా వూపిరాడక 32 ఆవులు చనిపోయాయి. ఈ విషయం తెలిస్తే రచ్చ రచ్చ అవుతుందని పోలీసులు గుట్టుచప్పుడుకాకుండా గురువారం రాత్రి ప్రకాశరావు పాలెం వద్ద తీసుకుపోయి కళేబరాలను పడేసేందుకు ప్రయత్నించారు. ఇది అక్కడి ప్రజలకు తెలిసిపోయింది. వెంటనే వారు లారీని చుట్టు ముట్టారు. దానితో ప్రాణభయంతో లారీ ని అక్కడే వదిలేసి డ్రైవర్, క్లీనర్ పరారయ్యారు. వర్షానికి ఊపిరాడక ఆవులు చనిపోయి ఉండొచ్చని అనుకుంటున్నారు.స్థానికులు పోలీసుల తీరుపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులపై చర్య తీసుకోవాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు.