పోలీసులకు రూ.3లక్షల జరిమానా
ఓ మహిళపై తప్పుడు కేసు పెట్టినందుకు
ఓ మహిళపై తప్పుడు కేసు పెట్టినందుకు పోలీసులకు భారీ జరిమానా విధించారు. ఈ మేరకు రాష్ట్ర మానవ హక్కుల కమీషన్ ఉత్తర్వులు జారీ చేసింది. ఇంతకీ విషయం ఏమిటంటే..మదురై అరుల్దాసపురానికి చెందిన జయ.. మానవ హక్కుల కమిషన్లో ఒక పిటిషన్ దాఖలు చేశారు.
మదురై ప్రభుత్వ ఆస్పత్రిలో ఒప్పందం పద్ధతిలో పారిశుద్ధ్య పనులు చేశానని, పనికి వెళ్లడం మానేసిన తర్వాత ఆస్పత్రిలో తాను శిశువును అపహరించినట్లు మదిచ్చియం పోలీసులు చెబుతున్నారని పేర్కొన్నారు. తాను దానికి అంగీకరించక పోవడంతో ఇన్స్పెక్టర్ జయరామన్, ఎస్సై సెల్వరాజ్, కానిస్టేబుళ్లు అళగుపాండి, విద్యాపతి తనను కొట్టి హింసించారని ఆరోపించారు.
వారిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై బుధవారం విచారణ చేపట్టిన న్యాయమూర్తి జయచంద్రన్ బాధితురాలు జయాకు రాష్ట్ర ప్రభుత్వం రూ.3 లక్షలు పరిహారంగా ఇవ్వాలని, ఆ మొత్తాన్ని నలుగురి పోలీసుల నుంచి తలా రూ.75 వేల చొప్పున వసూలు చేసుకోవాలని సూచించారు. అంతేకాకుండా ఆ నలుగురు పోలీసులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఉత్తర్వులు జారీ చేశారు.