వినాయకచవితికి 20వేల మంది భద్రతా సిబ్బంది
- పోలీసు బందోబస్తు పెంచుతున్నట్లు నగర పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి తెలిపారు
- శాంతి భద్రతలను నెలకొల్పేందుకు 20వేల మంది పోలీసులను నియమిస్తున్నట్లు ఆయన చెప్పారు
గణనాథుని సందడి హైదరాబాద్ నగరంలో ప్రారంభమైంది. వినాయక చవితిని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు షురూ చేస్తున్నారు. అసలు వినాయక చవితి అనగానే.. ప్రజలు అధిక సంఖ్యలో ఒకచోట చేరి పూజలు నిర్వహిస్తారు. అంతేకాకుండా నిమజ్జనం సమయంలోనూ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొంటారు. అలాంటి సమయంలో అనుకోని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. అందుజేత వాటిని అరికట్టేందుకు హైదరాబాద్ నగర పోలీసు కమిషనరేట్ చర్యలు తీసుకుంటోంది.
వినాయకచవితి, బక్రీద్ వంటి పర్వదినాల సమయంలో పోలీసు బందోబస్తు పెంచుతున్నట్లు నగర పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి తెలిపారు. పండగల సమయంలో శాంతి భద్రతలను నెలకొల్పేందుకు 20వేల మంది పోలీసులను నియమిస్తున్నట్లు ఆయన చెప్పారు. వీరితోపాటు 5వేల మంది భద్రతా సిబ్బందిని కూడా నియమిస్తున్నట్లు తెలిపారు.
గణేషుని మండపాల వద్ద పోలీసులు జియో ట్యాగ్ తో అనుసంధానమై ఉంటారని, అంతేకాకుండా అన్ని ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు క్యూఆర్ కోడ్ కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ఉంటుందని మహేందర్ రెడ్డి చెప్పారు.వినాయక నిమజ్జనానికి 36 క్రేనులను ఏర్పాటు చేశామన్నారు. మూడు షిప్టులలో వీటిని ఉపయోగిస్తామని చెప్పారు. నగర వ్యాప్తంగా 12వేల సీసీటీవీ కమేరాలను ఏర్పాటు చేసినట్లు చేసినట్లు తెలిపారు. కేవలం వినాయక చవితి పర్వదినానికే కాకుండా ముస్లింల పండుగ బక్రీద్ నాడు కూడా పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.
బక్రీద్ సమయంలో ప్రజలు పరిశుభ్రమైన ఆచారాలు పాటించాలని ఆయన కోరారు. జంతువుల వ్యర్థాలను పడేయడం కోసం ప్రత్యేకంగా పాలిథిన్ కవర్లను ఉచితంగా అందజేస్తామని చెప్పారు. ఆ కవర్లను జీ హెచ్ ఎంసీ సిబ్బంది తీసుకువెళతారని ఆయన తెలిపారు.