భారత మార్కెట్ లోకి మరో లక్జరీ కారు
కారు ధర ఎంతో తెలుసా..?
భారత మార్కెట్ లోకి మరో లక్జరీ కారు అడుగుపెట్టింది. జపాన్కు చెందిన కార్ల ఉత్పత్తి సంస్థ టొయోటా లగ్జరీ వాహనాల విభాగమైన లెక్సస్.. తాజాగా ఓ సరికొత్త మోడల్ కారును దేశీయ విపణిలోకి తీసుకొచ్చింది. ఎల్ఎస్ 500హెచ్ పేరుతో విడుదల చేసిన ఈ లగ్జరీ కారు ధర రూ.1.77కోట్ల నుంచి ప్రారంభం కానుంది.
భారత మార్కెట్ లోకి అడుగుపెట్టిన ఫిఫ్త్ జనరేషన్ కారు ఇది. ఎల్ఎస్ 500హెచ్ లగ్జరీ వేరియంట్ ధర రూ.1.77కోట్లు, ఆల్ట్రా వేరియంట్ ధర రూ. 1.82కోట్లు, డిస్టింక్ట్ వేరియంట్ ధర రూ. 1.93కోట్లుగా ఉన్నట్లు సంస్థ ప్రకటించింది. సంప్రదాయ పెట్రోల్, డీజిల్ మోడళ్లను పక్కనబెట్టిన లెక్సస్ గత కొంతకాలంగా హైబ్రీడ్-ఎలక్ట్రిక్ కార్లను తయారు చేస్తోంది. ఎల్ఎస్ 500హెచ్ కూడా అలాంటి మోడలే. ఇక ఎల్ఎస్ 500హెచ్ ఫీచర్ల విషయానికొస్తే.. ఈ లగ్జరీ సెడాన్కు గల 3.5 లీటర్ల వీ6 పెట్రోల్ ఇంజిన్.. రెండు ఎలక్ట్రిక్ మోటార్లతో కలిసి పనిచేస్తుంది. ఇవన్నీ కలిసి 350 బయోహార్స్పవర్ శక్తిని ఉత్పత్తి చేస్తాయి. ఇక గత మోడళ్లలాగే ఇందులోనూ ఈసీవీటీ ట్రాన్స్మిషన్ సదుపాయం ఉంది.