ఖమ్మంలో డబుల్ బెడ్రూం కోసం ఆత్మహత్యాయత్నం (వీడియో)
తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజలకోసం నిర్మించిఇస్తున్న డబుల్ బెడ్ రూం ఇళ్లు రాలేదని మనస్థాపంతో ఇద్దరు వ్యక్తులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా ఆర్డీవో కార్యాలయంలోనే జరగడంతో తీవ్ర కలకలం చెలరేగింది. ఈ ఘటనకు సండబంధించిన వివరాలు కింది విధంగా ఉన్నాయి.
ఖమ్మం రూరల్ మండలం ఆరెకోడు తండాకు ప్రభుత్వం 18 రెండు పడకగదుల ఇళ్లు మంజూరు చేసింది. వీటి కోసం గ్రామంలోని 120 కుటుంబాలు దరఖాస్తు చేసుకున్నాయి. అయితే రెవెన్యూ అధికారులు గ్రామంలో విచారణ జరిపి మంజూరైన 18 ఇళ్లకోసం 18 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. దీంతో ఈ డబుల్ బెడ్ రూం ఇళ్లు తమకు వస్తాయని భావించిన దరఖాస్తుధారులు బానోతు అప్పారావు, గుగులోతు నరేష్ తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. దీంతో సోమవారం ఖమ్మం ఆర్డీవో కార్యాలయానికి వెళ్లిన వీరు పురుగుమందు తాగి ఆత్మహత్యకు యత్నించారు.అపస్మారక స్థితిలో పడివున్న బాధితులను గమనించిన కుటుంబసభ్యులు, స్థానికులు వెంటనే ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వీరిద్దరికి చికిత్స జరుగుతోందని వీరి పరిస్థితి విషమంగానే ఉన్నట్లు డాక్టర్లు చెబుతున్నారు.