సిమెంట్ బస్తాల ట్రక్కు బోల్తా.. 19మంది మృతి
గుజరాత్ లో ఘోర ప్రమాదం
గుజరాత్లో శనివారం ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సిమెంట్ బస్తాలు తీసుకెళ్తున్న ఓ ట్రక్కు బోల్తా పడటంతో 19 మంది దుర్మరణం చెందారు. భావనగర్-అహ్మదాబాద్ హైవేపై బవల్యాలీ గ్రామం సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
రోడ్డుపై మలుపు తిరుగుతుండగా ట్రక్కు అదుపుతప్పి పక్కనే ఉన్న గుంతలో పడిపోయిందని ప్రత్యక్ష సాక్ష్యులు చెప్పారు. ఈ ఘటనలో 19 మంది మృతిచెందగా.. మరో ఏడుగురు గాయపడ్డారు. సమాచారమందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను కూడా ఆసుపత్రికి తరలించారు. ఘటన అనంతరం ట్రక్కు డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయాడు. అతివేగం లేదా డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.