నిజామాబాద్ మదర్సాలో 15 మంది విద్యార్థుల అస్వస్థత, ఒకరి మృతి
కలుషిత ఆహారం తిని విద్యార్థులు అస్వస్థతకు గురైన సంఘటన నిజామాబాద్ లోని ఓ మదర్సాలో చోటుచేసుకుంది. ఓ విద్యార్థి ఆస్పత్రిలో చికిత్ప పొందుతూ మృతి చెందింది. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
నిజామాబాద్ నగర శివారు మాలపల్లిలోని మదర్సాలో ఇవాళ ఉదయం టిఫిన్ చేసిన తర్వాత విద్యార్థులు అనారోగ్యానికి గురయ్యారు. కిచిడి తిని అస్వస్థతకు గురైన దాదాపు 15 మంది విద్యార్థులను హుటాహుటిన నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే ఆస్పత్రిలో చికిత్సపొందుతూ కామారెడ్డి జల్లా నస్రుల్లాబాద్కు చెందిన సుమయా ఫిర్దోషి (16) అనే విద్యార్థిని మృత్యువాత పడింది. ఇంకా 14 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని వారిలో 11 మంది పిరిస్థితి విషమంగానే ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు.మరో ముగ్గురు విద్యార్థినుల పరిస్థితి మెరుగుపడటంతో వారిని డిశ్చార్జి చేశారు.
మదర్సాలో అపరిశుభ్ర వాతావరణం తో పాటు వంట గదిలో కూడా పరిశుభ్రత పాటించకపోవడంతోనే ఈ విషాద సంఘటన జరిగినట్లు తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థినుల సంఖ్య కూడా అధికంగా ఉండటంతో వారికి సరిపడా గదులు లేక పరిసరాలు అపరిశుభ్రంగా మారి ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయన్నారు. ఈ ఘటనపై మదర్సా సిబ్బంది తమకెలాంటి సమాచారం ఇవ్వలేదని విద్యార్థినుల తల్లిదండ్రులు వాపోతున్నారు.