ముంబయిలో ఘోర అగ్నిప్రమాదం..12మంది సజీవదహనం
- స్నాక్స్ దుకాణంలో అగ్నిప్రమాదం
- 12మంది సజీవదహనం
- పలువురికి గాయాలు
దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో సోమవారం ఉదయం ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 12మంది సజీవదహనమయ్యారు. ముంబయిలోని సాకినాకా ప్రాంతంలోని ఓ స్నాక్స్ దుకాణంలో అనుకోకుండా సోమవారం తెల్లవారుజామున 4గంటల ప్రాంతంలో అగ్నిప్రమాదం జరిగింది. ప్రమాదం సంభవించిన సమయంలో 15మంది వర్కర్లు దుకాణంలో నిద్రపోతున్నారు. అగ్ని దుకాణం మొత్తం దావానంలా వ్యాపించడంతో వర్కర్లు తప్పించుకోడంలో విఫలమయ్యారు. 12మంది అగ్నికి ఆహుతికాగా.. మిగిలిన వర్కర్లు గాయాలతో బయటపడ్డారు. ప్రాణ నష్టంతోపాటు ఆస్తి నష్టం కూడా భారీగానే సంభవించింది.
స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయకచర్యలు చేపట్టారు. అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపుచేసేందుకు ప్రయత్నిస్తున్నారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గల కారణాలపై ఇంకా స్పష్టత రాలేదు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.