ఆఫ్ఘన్లో ఇంకా తెలుగువారున్నారు.. రక్షించండి, కేంద్రానికి ఎంపీ మిథున్ రెడ్డి విజ్ఞప్తి
ఆఫ్గాన్లో చాలా మంది తెలుగువాళ్లు పనిచేస్తున్నారని.. వారందరినీ క్షేమంగా తీసుకురావాలని కేంద్రాన్ని కోరామన్నారు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి. దేశ దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని వ్యూహాలను రూపొందించాలని సూచించామని మిథున్ రెడ్డి పేర్కొన్నారు
ఆఫ్గనిస్తాన్లో ప్రస్తుతం చోటు చేసుకుంటున్న పరిణామాలపై ఢిల్లీలో అఖిలపక్షం గురువారం సమావేశమైంది. తాజా పరిస్థితిని ఫ్లోర్లీడర్లకు విదేశాంగ శాఖ వివరించింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీ మిథున్రెడ్డి హాజరయ్యారు. సమావేశం అనంతరం మిథున్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, అఫ్గాన్లో చాలా మంది తెలుగువాళ్లు పనిచేస్తున్నారని.. వారందరినీ క్షేమంగా తీసుకురావాలని కోరామని ఆయన తెలిపారు. దేశ దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని వ్యూహాలను రూపొందించాలని సూచించామని మిథున్ రెడ్డి పేర్కొన్నారు. ప్రతి అంశంలో ఆచితూచి వ్యవహరిస్తామని విదేశాంగ మంత్రి చెప్పారని ఆయన తెలిపారు.
Also Read:మాట తప్పిన తాలిబాన్.. మన పౌరుల తరలింపునకే ప్రాధాన్యత: కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్
అంతకుముందు విదేశాంగ మంత్రి జైశంకర్ మాట్లాడుతూ.. దోహాలో జరిగిన శాంతి చర్చల్లో ఇచ్చిన మాటకు తాలిబన్లు కట్టుబడి లేరని, వారు మాట తప్పారని అన్నారు. ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్లో పరిస్థితులేమీ బాగాలేవని వివరించింది. అందుకే అక్కడి నుంచి భారతీయులను స్వదేశానికి తరలించడానికి అన్ని ప్రయత్నాలూ చేస్తున్నామని కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు. పార్లమెంటు కాంప్లెక్స్లో నిర్వహించిన అఖిల పక్ష సమావేశంలో అన్ని పార్టీల నేతలకు ఆయన ఆఫ్ఘనిస్తాన్లోని పరిస్థితులను వివరించారు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి బయటకు రావడానికి సుమారు 15వేల మంది భారత ప్రభుత్వ సహాయం కోరినట్టు చెప్పారు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి భారతీయులను తరలించడమే ప్రధానంగా తీసుకున్నట్టు వివరించారు.