సుప్రీం ప్రధాన న్యాయమూర్తి రమణకు జగన్ శుభాకాంక్షలు: కేసీఆర్ సైతం...
భారత ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసిన జస్టిస్ ఎన్వీ రమణకు ఏపీ సీఎం వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ఎన్వీ రమణకు శుభాకాంక్షలు తెలిపారు.
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసిన జస్టిస్ ఎన్వీ రమణకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు ట్విట్టర్ వేదికగా ఆయన ఆ శుభాకాంక్షలు తెలిపారు.
ఎన్వీ రమణకు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు కూడా శుభాకాంక్షలు తెలిపారు. మీ పాండిత్యం, విస్తారమైన అనుభవం దేశానికి ఎంతో ఉపయోగపడుతుందనే నమ్మకం ఉందని ఆయన ఎన్వీ రమణకు శుభాకాంక్షలు తెలిపారు. ఎన్వీ రమణ తన పదవీ కాలాన్ని అత్యుత్తమంగా సాగించాలని ఆయన ఆశించారు.
సుప్రీం ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసిన ఎన్వీ రమణకు బిజెపి నేత విజయశాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు. ఇది తెలుగువారంతా గర్వించదగిన శుభతరుణమని ఆమె అన్నారు.
భారత 48వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టీస్ ఎన్వీ రమణ శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్ లో ఆయన చేత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు, ప్రదాని నరేంద్ర మోడీ, పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు.