Har Ghar Tiranga : జాగ్వర్ కారుకు జెండా రంగులు వేసి.. వినూత్న రీతిలో దేశభక్తి చాటిన వ్యక్తి.. వీడియో వైరల్..
గుజరాత్ కు చెందిన ఓ యువకుడు వినూత్న రీతిలో దేశభక్తిని చాటుకున్నాడు. ఖరీదైన తన జాగ్వర్ కారుకు జాతీయ జెండా రంగులను వేయించి.. గుజరాత్ నుంచి ఢిల్లీకి ప్రయాణించాడు. ఈ రంగులు వేయించడం కోసం రూ.2లక్షలు ఖర్చు చేశాడు.
గుజరాత్ : స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వజ్రోత్సవ వేడుకలు దేశవ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ పేరిట కేంద్ర ప్రభుత్వం ఉత్సవాలు నిర్వహించింది. హర్ ఘర్ తిరంగా పేరుతో ప్రతి ఇంటిపై మువ్వన్నెల జెండా ఎగురవేయాలని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు, దేశంలోని ప్రతి ఒక్కరు తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగరవేశారు. వాహనాలకు జాతీయ జెండాను పెట్టుకుని తన దేశభక్తిని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఓ వ్యక్తి వినూత్నంగా తన దేశభక్తిని చాటుకున్నారు.
ఖరీదైన తన కారుకు జాతీయ జెండా రంగులు వేయించాడు. కుటుంబంతో సహా ఢిల్లీ వరకు హర్ ఘర్ తిరంగా ప్రచారం చేపట్టారు. గుజరాత్లోని సూరత్ కు చెందిన సిద్ధార్థ జోషి.. తన ఖరీదైన జాగ్వార్ కారుకు జాతీయ జెండా రంగులు వేయించాడు. కారు బ్యానెట్ తో పాటు డోర్లు మీద ‘ఆజాదీకా అమృత్ మహోత్సవ్’, ‘హర్ ఘర్ తిరంగా’ ప్రచార లోగోలను పెయింట్ వేయించాడు. దీని కోసం రెండు లక్షల రూపాయల వరకు ఖర్చు చేశాడు. కారును అందంగా ముస్తాబు చేసిన తర్వాత… అందులో కుటుంబ సమేతంగా దేశ రాజధాని ఢిల్లీకి పయనమయ్యారు. సూరత్ నుంచి 1,300 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఢిల్లీని రెండు రోజుల్లో చేరుకున్నారు.
పార్లమెంట్ దగ్గర కారుతో చక్కర్లు కొట్టారు. ప్రధాని మోడీతో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలుసుకోవాలని ఉందని తమ మనసులోని కోరికను బయటపెట్టాడు త్రివర్ణ పతాకం రంగులో ఉన్న ఈ కారు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.
ఇదిలా ఉండగా, ఆజాదీకా అమృత్ మహోత్సవాల్లో భాగంగా దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు చేపట్టారు. పెద్ద ఎత్తున ర్యాలీలు, జెండా వందనాలు చేశారు. ప్రతి పాఠశాలలో విద్యార్థులు ఆయా గ్రామాల్లో ర్యాలీలు చేపట్టారు. ప్రభుత్వ కార్యాలయాల్లోనూ జెండా కార్యక్రమాలు జరిగాయి. చేశారు ప్రజాప్రతినిధులు మొదలు సామాన్యుల వరకూ అందరూ తమ ఇళ్లపై జెండాలను ఎగురవేసి తన దేశభక్తిని చాటుకున్నారు. ఈ క్రమంలోనే కర్నూలుకు చెందిన కళ్యాణ్ అనే వ్యక్తి వినూత్న రీతిలో దేశభక్తిని చాటుకున్నాడు. దేశ స్వాతంత్య్ర వజ్సోత్సవ వేడుకల వేల తన తల వెంట్రుకల్ని 75 వ స్వాతంత్ర వేడుకలకు చిహ్నంగా తీర్చి దిద్దుకున్నాడు.
75వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కల్యాణ్ ప్రదర్శించిన దేశభక్తి..అందరికీ అబ్బురపరిచింది. ఇది వినూత్న ప్రచారానికి దారితీసింది. సాధారణంగా తలవెంట్రుకలను దేవుళ్లకు సమర్పించుకోవడాన్ని మనం చూస్తుంటాం. అయితే ఉమ్మడి కర్నూల్ జిల్లావాసి తనదైన శైలిలో దేశభక్తి ప్రదర్శించాడు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కర్నూలుకు చెందిన కళ్యాణ్ అనే వ్యక్తి 75 ఆకారం వచ్చేలా కటింగ్ చేయించుకుని దేశ భక్తిని చాటుకున్నాడు.