సారాంశం
ప్రయాగరాజ్లోని ఝూన్సీలో 52x52x52 అడుగుల విస్తీర్ణంలో ప్రపంచంలోనే అతిపెద్ద మహామృత్యుంజయ యంత్రం నిర్మితమైంది.
Kumbh Mela 2025: మహా కుంభమేళ 2025 సందర్భంగా ప్రయాగరాజ్లోని ఝూన్సీ హవేలీలోని తపోవన ఆశ్రమంలో ప్రపంచంలోనే అతిపెద్ద మహామృత్యుంజయ యంత్రం నిర్మాణం పూర్తయింది. ఇది 52x52x52 అడుగులతో విస్తరించి వుంది. ఈ అద్భుత యంత్ర నిర్మాణానికి దాదాపు 4 కోట్ల రూపాయలు ఖర్చయ్యాయి. మకర సంక్రాంతి (జనవరి 14) నుండి 151 మంది ఆచార్యులు ఈ యంత్రం కింద కూర్చొని మహామృత్యుంజయ మంత్రాన్ని జపిస్తూ 11 లక్షల 11 వేల 111 పంచముఖి రుద్రాక్షలను అభిమంత్రిస్తున్నారు. ఈ రుద్రాక్షలను మహా కుంభమేళకు వచ్చే భక్తులకు ఉచితంగా ఇస్తారు.
ఈ యంత్రాన్ని స్థాపించిన స్వామి సహజానంద మహారాజ్ మాట్లాడుతూ.. యువతలో పెరుగుతున్న మానసిక ఒత్తిడులు, ఆందోళన, ఆత్మహత్యలను నివారించడమే ఈ ఆధ్యాత్మిక శక్తి కేంద్రం ఉద్దేశ్యమని అన్నారు. ఈ అభిమంత్రిత రుద్రాక్షలు ఇంట్లో సానుకూల శక్తిని, మానసిక ప్రశాంతతను కలిగిస్తాయని, ప్రతికూల ఆలోచనలను దూరం చేస్తాయని ఆయన చెప్పారు.
దేశంలోని దివ్యశక్తులను మేల్కొలిపే ప్రయత్నం
స్వామి సహజానంద మహారాజ్ మాట్లాడుతూ... భారతదేశం ఋషిమునుల భూమి, ఇక్కడ దాగి ఉన్న దివ్యశక్తులను మేల్కొలిపే సమయం ఆసన్నమైందన్నారు. ఆయన ప్రణాళిక ప్రకారం ఈ మహామృత్యుంజయ యంత్రాన్ని భారతదేశంలోని 12 జ్యోతిర్లింగాలలోనూ స్థాపిస్తారు.
సోమనాథ్, కేదార్నాథ్, భీమాశంకర్, త్య్రంబకేశ్వర్లలో కూడా ఈ యంత్రాన్ని ప్రతిష్టిస్తారు. 12 జ్యోతిర్లింగాల తర్వాత ఢిల్లీలో కూడా దీన్ని నిర్మిస్తారు. ఈ ప్రయత్నం ద్వారా భారతదేశాన్ని ఆధ్యాత్మిక, ఆర్థికంగా మహాశక్తిగా నిలబెట్టి సనాతన ధర్మ శక్తిని ప్రపంచమంతటా వ్యాప్తి చేయాలని ఆయన అన్నారు.
మహామృత్యుంజయ మంత్రం, 52 అక్షరాల వెనుక శాస్త్రీయ రహస్యం
స్వామి సహజానంద మహారాజ్ ప్రకారం, మహామృత్యుంజయ మంత్రం 52 అక్షరాలతో కూడి ఉంటుంది. ఇది భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయంలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. 1. భారతదేశంలో మొత్తం 52 శక్తి కేంద్రాలు ఉన్నాయి. 2. మానవ శరీరంలో 52 ధ్వనులు, 52 శక్తి కేంద్రాలు ఉన్నాయి. 3. హిందీ వర్ణమాలలో 52 అక్షరాలు ఉన్నాయి.
ఈ మేరుమృష్టాకార యంత్రం పూర్తిగా శాస్త్రీయ సూత్రాలపై ఆధారపడి ఉంది. మంత్రాల ద్వారా దీన్ని ప్రేరేపిస్తున్నారు. దీనిలో ప్రాణం పోయడానికి 151 మంది ఆచార్యులు మహామృత్యుంజయ మంత్రాన్ని జపిస్తున్నారు. ఈ ప్రక్రియ ద్వారా యంత్రంలో అద్భుతమైన ఆధ్యాత్మిక శక్తి ఉత్పన్నమవుతుంది. దీన్ని దర్శించుకునే భక్తులకు మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మిక లాభం కలుగుతుంది.