ఉగ్రవాదం, సైబర్ నేరాలకు వ్యతిరేకంగా ప్రపంచం ఏకం కావాలి: ప్రధాని మోడీ
PM Modi: "వైవిధ్యం, ప్రజాస్వామ్యాన్ని కాపాడటంలో భారతదేశం ప్రపంచానికి ఒక కేస్ స్టడీ... గత 99 సంవత్సరాలలో ఇంటర్ పోల్ ప్రపంచవ్యాప్తంగా 195 దేశాలలో పోలీసు సంస్థలను అనుసంధానించింది. చట్టపరమైన ఫ్రేమ్వర్క్లో తేడాలు ఉన్నప్పటికీ ఇది జరిగిందని" ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.
Interpol General Assembly: ఉగ్రవాదం, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, సైబర్ నేరాలు, మానవ అక్రమ రవాణాకు వ్యతిరేకంగా ప్రపంచం ఏకం కావాలని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. "వైవిధ్యం, ప్రజాస్వామ్యాన్ని కాపాడటంలో భారతదేశం ప్రపంచానికి ఒక కేస్ స్టడీ... గత 99 సంవత్సరాలలో ఇంటర్ పోల్ ప్రపంచవ్యాప్తంగా 195 దేశాలలో పోలీసు సంస్థలను అనుసంధానించింది. చట్టపరమైన ఫ్రేమ్వర్క్లో తేడాలు ఉన్నప్పటికీ ఇది జరిగిందని" తెలిపారు. దేశ రాజధాని ఢిల్లీలోని ప్రగతి మైదాన్లో 90వ ఇంటర్పోల్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సాధారణ సమావేశానికి 195 సభ్య దేశాల నుండి మంత్రులు, దేశాల పోలీసు చీఫ్లు, జాతీయ కేంద్ర బ్యూరోల అధిపతులు, సీనియర్ పోలీసు అధికారులతో కూడిన ప్రతినిధులు హాజరయ్యారు. ఇంటర్ పోల్ జనరల్ అసెంబ్లీ అక్టోబర్ 18 నుంచి 21 వరకు జరగనుంది.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం ఇంటర్పోల్ 90వ మహాసభలో ప్రసంగించారు. ఈ క్రమంలోనే ఆయన పై వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదం, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, సైబర్ నేరాలు, మానవ అక్రమ రవాణాకు వ్యతిరేకంగా ప్రపంచం ఏకం కావాలని ఆయన గట్టిగా నొక్కి చెప్పారు. "బెదిరింపులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నప్పుడు, ప్రతిస్పందన కేవలం స్థానికంగా ఉండదు.. సామాజిక సంక్షేమం కోసం ప్రపంచ సహకారం అవసరం" అని ఆయన అన్నారు.అవినీతిపరులు, ఉగ్రవాదులు, మాదకద్రవ్యాలు, వేట ముఠాలు, వ్యవస్థీకృత నేరాలకు సురక్షితమైన స్థావరాలు ఉండవనీ, ఈ ప్రమాదాలను పరిష్కరించడానికి ప్రపంచవ్యాప్తంగా స్పందించాలని ఆయన పిలుపునిచ్చారు. అంతర్ముఖంగా చూసేందుకు తమ మద్దతు, సహకారం కోసం అన్ని దేశాలకు కూడా ఆయన పిలుపునిచ్చారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వానికి తమ సహకారం దోహదం చేస్తోందని తెలిపారు.
"సురక్షితమైన ప్రపంచం మన భాగస్వామ్య బాధ్యత, మంచి శక్తులు సహకరించినప్పుడు, నేర శక్తులు పనిచేయలేవు" అని ప్రధాని సమావేశంలో తన ప్రారంభ ప్రసంగంలో అన్నారు. వచ్చే ఏడాది అంటే 2023లో ఇంటర్పోల్ 100 ఏళ్లను జరుపుకోనుందని ఆయన ఈ సమావేశాన్ని చారిత్రక మైలురాయిగా పేర్కొన్నారు. "ఐక్యారాజ్య సమితి శాంతి పరిరక్షక కార్యకలాపాలలో భారతదేశం అగ్రగామిగా ఉంది" అని తెలిపారు. ప్రపంచాన్ని మెరుగైన ప్రదేశంగా మార్చడానికి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. అంతర్జాతీయ సంక్షోభాలను గురించి భారత్ ప్రతిస్పందనలను ప్రస్తావిస్తూ.. వాతావరణ లక్ష్యాల నుండి కోవిడ్ వ్యాక్సిన్ల వరకు, ఎటువంటి సంక్షోభంలోనైనా నాయకత్వం వహించడానికి భారతదేశం సుముఖత చూపిందని మోడీ అన్నారు. అలాగే, అవినీతి, ఆర్థిక నేరాలు అనేక దేశాల పౌరుల సంక్షేమాన్ని ఎలా దెబ్బతీశాయనే అశాలపై కూడా మాట్లాడారు.