ప్రపంచం నమస్తే పెడుతోంది: కరోనా వైరస్ భయంపై మోడీ
కరోనా వైరస్ వ్యాపిస్తున్న ప్రస్తుత తరుణంలో ప్రపంచం మొత్తం నమస్తే పెట్టడాన్ని అలవాటు చేసుకుంటోందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. మనవాళ్లు ఎవరైనా మానేసి ఉంటే తిరిగి అలవాటు చేసుకోవాలని ఆయన అన్నారు.
న్యూఢిల్లీ: కరోనావైరస్ పై పుకార్లను నమ్మవద్దని, వైద్యుల సూచనలను పాటించండని ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలకు సూచించారు. కరచాలనాలను మానేసి మరోసారి నమస్తే పెట్టాలని ఆయన చెప్పారు. జన ఔషధి కేంద్రాల యజమానులతో, ప్రధాన మంత్రి జన ఔషధి పరియోజన లబ్ధిదారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.
కరోనా వైరస్ పై పుకార్లను నమ్మవద్దని తన తోటి దేశ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. కరోనా వైరస్ విషయంలో వైద్యుల సలహాలను పాటించడం అవసరమని ఆయన అన్నారు.
ప్రపంచంలోని ప్రజలు పరస్పరం అభినందించుకునేందుకు నమస్తేను అలవాటు చేసుకుంటున్నారని ఆయన చెప్పారు. ఏదైనా కారణం వల్ల మనం దాన్ని మానేసి ఉంటే, కరచాలనం చేయడానికి బదులు దాన్ని తిరిగి అలవాటు చేసుకోవడానికి ఇదే సరైన సందర్భమని మోడీ అన్నారు.
జన ఔషధి కేంద్రాల ద్వారా ప్రతి నెలా కోటి కుటుంబాలకు పైగా చౌక ధరలకు మందులు అందుతున్నాయని ఆయన చెప్పారు. దేశవ్యాప్తంగా ఉన్న 6 వేల జన ఔషధి కేంద్రాల వలవ్ల ప్రజలు రూ. 2 వేల కోట్ల నుంచి 2 .5 కోట్ల రూపాయలు అదా చేసుకోగలుగుతున్నారని ఆయన చెప్పారు.