Asianet News TeluguAsianet News Telugu

భారత తొలి సోలార్ సిటీగా యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రాంతం.. ఇంతకీ ఆ ప్రాంతమేమిటంటే..? 

మధ్యప్రదేశ్‌లోని రైసెన్ జిల్లాలోని ప్రపంచ వారసత్వ ప్రదేశం సాంచి భారతదేశపు మొదటి సోలార్ సిటీగా అవతరించింది. ఐఐటీ కాన్పూర్ సహాయంతో రూపుదిద్దుకున్న ఈ ప్రాజెక్టును సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ బుధవారం లాంఛనంగా ప్రారంభించారు.

World Heritage Site In Madhya Pradesh Is India's First Solar City KRJ
Author
First Published Sep 7, 2023, 5:16 AM IST

మధ్యప్రదేశ్ లోని ప్రపంచ వారసత్వ ప్రదేశంగా యునెస్కో గుర్తింపు పొందిన బౌద్ధ స్థూపాల నగరం సాంచి ఇప్పుడు మరో ప్రత్యేకతను సొంతం చేసుకుంది. దేశంలోనే తొలి సోలార్ సిటీగా అవతరించింది. దేశంలోని మొదటి సోలార్ సిటీతో సాంచి జీరో కార్బన్ సిటీగా అభివృద్ధి చేయబడింది. భూమి యొక్క ఉపరితల ఉష్ణోగ్రతను నియంత్రించడానికి అంతర్జాతీయ ప్రయత్నాలకు ఇది ఒక ముఖ్యమైన ప్రయత్నం. ఐఐటీ కాన్పూర్ సహాయంతో రూపుదిద్దుకున్న ఈ ప్రాజెక్టును సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ బుధవారం లాంఛనంగా ప్రారంభించారు.  

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. సాంచికి సమీపంలోని నాగౌరీలో ఏర్పాటు చేసిన ఈ సోలార్ ప్రాజెక్టు 3 మెగావాట్ల సామర్థ్యాన్ని కలిగి ఉంది. అలాగే.. సంవత్సరానికి 13747 టన్నుల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను తగ్గిస్తుంది. ఇది దాదాపు 2.3 లక్షల చెట్లు గ్రహించేదానికి ఇది సమానం. దీనితో పాటు.. ప్రభుత్వం వెచ్చిస్తున్న  పౌరుల ఇంధన సంబంధిత వ్యయంలో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా రూ.7 కోట్లకు పైగా ఆదా అవుతుంది.

ఈ సందర్భంగా ఆ రాష్ట్ర సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్  మాట్లాడుతూ.. బొగ్గు, ఇతర వనరుల నుండి విద్యుత్ ఉత్పత్తి చేయడం వల్ల పర్యావరణంపై ప్రతికూల ప్రభావాన్ని కలిగిస్తుందని, దీంతో సాంచి పౌరులు, పునరుత్పాదక ఇంధన శాఖ, శాస్త్రవేత్తలందరూ కలిసి సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు కీలక అడుగులేశారని అన్నారు.  

ఈ క్రమంలో ఐఐటీ కాన్పూర్ సహాయంతో సాంచిని నెట్-జీరో సిటీగా మార్చాలనే సంకల్పం ప్రశంసనీయమన్నారు. ఈ నగరం ప్రపంచ దేశాలకు ఓ ఉదాహరణగా నిలుస్తుందని అన్నారు.   పర్యావరణాన్ని రక్షించడంతో పాటు పెరుగుతున్న ఇంధన అవసరాలను తీర్చాలంటే..  పునరుత్పాదక ఇంధన వినియోగం అవసరమని అన్నారు. త్వరలో సోలార్ పంపులు వ్యవసాయానికి కూడా సహాయపడతాయని ఆయన చెప్పారు. గుల్గావ్‌లో త్వరలో ఐదు మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్ ఏర్పాటు కానున్నటు తెలిపారు. ఇది సాంచి సమీపంలోని వ్యవసాయ రంగానికి ఇంధన అవసరాలను తీర్చగలదని అన్నారు.  సాంచిలోని సుమారు 7,000 మంది పౌరులు తమ ఇళ్లలో సోలార్ స్టాండ్ ల్యాంప్‌లు, సోలార్ లాంతర్‌లను ఉపయోగించడం ద్వారా విద్యుత్ ఆదా చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios