జ్ఞానవాపి బేస్మెంట్లో పూజలకు కోర్ట్ అనుమతి .. ఆ వ్యాజ్యాల్లోనూ విజయం ఖాయం : న్యాయవాది అలోక్ కుమార్
వారణాసిలోని వివాదాస్పద జ్ఞానవాపి మసీదు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రార్థనా మందరంలోని సీల్ వేసి వున్న బేస్మెంట్లో పూజలు చేసుకునేందుకు వారణాసి కోర్టు అనుమతించింది. న్యాయస్థానం తీర్పుపై విశ్వహిందూ పరిషత్ వర్కింగ్ ప్రెసిడెంట్, సీనియర్ న్యాయవాది అలోక్ కుమార్ ఒక ప్రకటన విడుదల చేశారు.
![Working President of the VHP and senior advocate Alok Kumar comments on district court gives permission for worship in the gyanvapi basement ksp Working President of the VHP and senior advocate Alok Kumar comments on district court gives permission for worship in the gyanvapi basement ksp](https://static-ai.asianetnews.com/images/01hnfgkwbq0xmgyavnfkxdch6m/7--11-_363x203xt.jpg)
వారణాసిలోని వివాదాస్పద జ్ఞానవాపి మసీదు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రార్థనా మందరంలోని సీల్ వేసి వున్న బేస్మెంట్లో పూజలు చేసుకునేందుకు వారణాసి కోర్టు అనుమతించింది. దీనికి అనుగుణంగా వారం రోజుల్లోగా ఏర్పాట్లు చేయాలని, భక్తులు పూజలు చేసుకునేందుకు అనుగుణంగా బారికేడ్లు తొలగించాలని అధికార యంత్రాంగాన్ని న్యాయస్థానం ఆదేశించింది. కాశీ విశ్వనాథ ఆలయానికి చెందిన అర్చకులతో పూజలు చేయించాలని కోర్టు సూచించినట్లుగా న్యాయవాది విష్ణు శంకర్ జైన్ వెల్లడించారు.
జ్ఞానవాపి మసీదుకు దక్షిణం వైపు నేలమాళిగలో ఒక ఆలయం వుంది. ఈ ఆలయంలో 1993 వరకు నిత్యపూజ, అర్చన జరుగుతూ వుండేది. అయితే 1993లో ప్రభుత్వం ఈ ప్రదేశంలోకి హిందువులు వెళ్లకుండా నిషేధం విధించింది. మనుపటి పరిస్థితిని పునరుద్ధరించడానికి కొన్ని హిందూ సంఘాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. వారణాసి జిల్లా మేజిస్ట్రేట్ ఆస్తి రిసీవర్గా నియమించబడ్డారు.
తాజాగా న్యాయస్థానం తీర్పుపై విశ్వహిందూ పరిషత్ వర్కింగ్ ప్రెసిడెంట్, సీనియర్ న్యాయవాది అలోక్ కుమార్ ఒక ప్రకటన విడుదల చేశారు. కాశీ విశ్వనాథ్ ట్రస్ట్తో పాటు ఆ దావాలో పూజారిని కూడా నియమించాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేయడం సంతోషకరమన్నారు. ఆ నేలమాళిగలోని ఆలయంలో సాధారణ పూజ , అర్చన, ఇతర ఆచారాలకు అనుగుణంగా పూర్వ స్థితిని కోర్టు పునరుద్ధరించిందని అలోక్ పేర్కొన్నారు.
ప్రధాన దావాపై వేగవంతమైన నిర్ణయానికి ఇది ముందడుగుగా ఆయన అభివర్ణించారు. అందుబాటులో వున్న సాక్ష్యాధారాలు, చట్టంపై తనకున్న అవగాహన ఆధారంగా .. ప్రధాన దావాలలో తుది తీర్పు కూడా మనకు అనుకూలంగా వుంటుందని అలోక్ ఆకాంక్షించారు. విశ్వేశ్వరుని ఆలయానికి జ్ఞానవాపి స్థలాన్ని తిరిగి పొందుతామని తాను ఆశిస్తున్నానని ఆయన చెప్పారు.
కాగా.. జ్ఞానవాపి మసీదు కాంప్లెక్స్ ప్రాంగణంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు భారత పురావస్తు విభాగం (ఏఎస్ఐ) శాస్త్రీయ సర్వే నిర్వహించింది. ఇటీవలే దీనికి సంబంధించిన నివేదికను కూడా సీల్డ్ కవర్లో కోర్టుకు సమర్పించింది. దీని ప్రకారం .. మసీదు వున్న ప్రదేశంలో ఒకప్పుడు గొప్ప హిందూ ఆలయం మనుగడలో వున్నట్లు పేర్కొందని హిందువుల తరపు న్యాయవాది విష్ణు శంకర్ జైన్ చెప్పారు. తెలుగు, కన్నడ, దేవనాగరి సహా 34 భాషల్లో వున్న శాసనాలు.. దేవతా విగ్రహాలు బయటపడినట్లు ఆయన వెల్లడించారు.