ముంబయి లోకల్ ట్రైన్లో సీటు కోసం శివాలెత్తిన మహిళలు.. జుట్లు పట్టుకుని వాదులాట (వీడియో)
ముంబయి లోకల్ ట్రైన్ లేడీస్ కంపార్ట్మెంట్లో సీటు కోసం ముగ్గురు మహిళల మధ్య ప్రధానంగా గొడవ జరిగింది. జుట్లు పట్టుకుని ఈడ్చుకుంటూ బాదుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.
ముంబయి: మహారాష్ట్ర రాజధాని ముంబయి లోకల్ ట్రైన్ గురించి వచ్చే వార్తల్లో చాలా వరకు రద్దీ గురించే ఉంటాయి. ఆ లోకల్ ట్రైన్లో ఒకరిపై ఒకరు బరువేసి ప్రయాణిస్తున్నట్టుగానే ఉంటుంది. కోచ్లో ఊపిరాడని రీతిలో రద్దీ ఉంటుంది. తాజాగా, ఈ ట్రైన్లో ఓ మహిళ కోచ్లో ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. థానె, పన్వెల్ మధ్య ప్రయాణిస్తున్న లోకల్ ట్రైన్ లేడీస్ కంపార్ట్మెంట్లో ఈ ఘటన జరిగింది.
మహిళలకు కేటాయించిన బోగీలో కొందరు మహిళలు సీటు కోసం ఏకంగా భౌతిక దాడికే దిగారు. సీటు కేంద్రంగా ఇద్దరు మహిళలు ఒకరిపై ఒకరు చేయి చేసుకున్నారు. ఆ తర్వాత ఆ గొడవ ఇతర మహిళలకూ వ్యాపించింది. జుట్లు పట్టుకుని ఈడ్చుకుంటూ గొడవ చేసుకునే దాకా చేరింది పరిస్థితి. ఇంతలో ఓ మహిళా కానిస్టేబుల్ జోక్యం చేసుకునే ప్రయత్నం చేశారు.
ఈ వాదులాటను ఆపడానికి మహిళా కానిస్టేబుల్ శారదా ఉగ్లె ప్రయత్నం చేశారు. కానీ, ఆమె ఆపలేకపోయారు. ఆమెనే గాయాల పాలయ్యారు. చివరకు ఓ హాస్పిటల్లో ఆమె చికిత్స పొందడానికి అడ్మిట్ అయ్యారు. సీటు కోసం జరిగిన వివాదంలో ఓ మహిళా స్టాఫ్ గాయపడ్డారని సీనియర్ పోలీసు ఇన్స్పెక్టర్ వాషి రైల్వే స్టేషన్ ఎస్ కటారే తెలిపారు.