పంచాయతీలో ఉద్యోగం చేయడానికి కౌన్సిలర్లు ఒప్పుకోకపోవడంతో ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన తమిళనాడులో కలకలం రేపింది. 

తమిళనాడు : దేవుడు వరమిచ్చినా పూజారి వరమివ్వలేదన్నట్టుగా కొన్నిసార్లు కొన్ని సంఘటనలు కనిపిస్తుంటాయి. ఓ మహిళకు కలెక్టర్ ఉద్యోగం ఇవ్వగా.. కౌన్సిలర్లు మాత్రం దానికి నిరాకరించారు. దీంతో మనస్థాపంతో ఆ మహిళ బస్సులో నుంచి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన తమిళనాడులోని.. మధురైలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే… పేదరికంతో ఇబ్బంది పడుతున్న ఓ మహిళకు.. అక్కడి జిల్లా కలెక్టర్ ఉద్యోగం ఇచ్చారు. కానీ కౌన్సిలర్లు మాత్రం ఆమెను ఉద్యోగంలోకి తీసుకోవడానికి నిరాకరించారు. దీంతో ఆమె తీవ్ర మనస్థాపానికి గురైంది. 

నడుస్తున్న బస్సులో నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి పేరు నాగలక్ష్మి. మధురై జిల్లా తిరుమంగళం ప్రాంత నివాసి. ఆమె భర్త గణేశన్. వీరికి ఐదుగురు సంతానం. పేదరికం, కుటుంబ పోషణ భారం కావడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో తనకేదైనా ఉద్యోగం ఇప్పించాలని నాగలక్ష్మి ఇటీవల కలెక్టర్ కు వినతిపత్రం ఇచ్చారు. ఈ వినతి పత్రాన్ని పరిశీలించిన కలెక్టర్ నాగలక్ష్మిని మైయిట్టాన్ పట్టి పంచాయతీలో ఉపాధి హామీ పథకానికి బాధ్యురాలిగా నియమించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఆమె మైయిట్టాన్ పట్టి పంచాయతీ కార్యాలయానికి వెళ్లారు.

మోదీ ఇంటిపేరు వివాదం.. రాహుల్ గాంధీకి పట్నా కోర్టు సమన్లు.. ఏప్రిల్ 25న హాజరు కావాలని ఆదేశం...

అయితే అక్కడ కౌన్సిలర్లైన బాలమురుగన్, వీరకుమార్,ముత్తులు ఆమెను ఉపాధి హామీ పథకానికి బాధ్యురాలుగా నియమించడాన్ని వ్యతిరేకించారు. అక్కడ అధికారులు కూడా వీరి వ్యతిరేకతతో స్పందించలేదు. నాగలక్ష్మి ఈ నిరాదరణకు తీవ్ర మనస్థాపానికి గురైంది. ఈ నేపథ్యంలోనే బుధవారం నాడు తిరుమంగళానికి వెళ్లడానికి బస్సులో ఎక్కింది నాగలక్ష్మి. బస్సు రన్నింగ్ లో ఉండగా ఒక్కసారిగా ఆ బస్సులో నుంచి కిందికి దూకి ఆత్మహత్య చేసుకుంది.

ఈ హఠాత్పరిణామానికి బస్సులోని వారంతా దిగ్బ్రాంతికి గురయ్యారు. వెంటనే బస్సును ఆపి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దీనిమీద దర్యాప్తు ప్రారంభించారు. నాగలక్ష్మి దగ్గర ఓ లెటర్ దొరికింది. దాంట్లో కలెక్టర్ చెప్పినా.. తనకు ఉద్యోగం ఇవ్వకుండా అవమానిస్తూ మాట్లాడిన కౌన్సిలర్లే తన ఆత్మహత్యకు కారణమని ఆమె తెలిపింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు కొనసాగిస్తున్నారు.