నేను ఈ గర్భాన్ని మోయలేను.. అబార్షన్కు అనుమతివ్వండి, కోర్టుకి సంచలన విషయాలు చెప్పిన మహిళ
ఉత్తరప్రదేశ్లో ఓ మహిళ తనకు అబార్షన్ చేయించుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ కోర్టుకెక్కడం సంచలనం సృష్టించింది. ఇందుకు ఆమె చెప్పిన కారణాలు విని న్యాయమూర్తి సైతం ఆశ్చర్యపోయారు.
స్త్రీ జన్మకు పరిపూర్ణ సార్ధకత కలిగితే ఆమె అమ్మగా మారినప్పుడే. అందుకే పెళ్లయిన నవదంపతులు ఎప్పుడెప్పుడు శుభవార్త చెబుతారా అని ఎదురుచూస్తూ వుంటారు. ఏళ్లు గడుస్తున్నా పిల్లలు పుట్టకపోతే వారి బాధ వర్ణనాతీతం. పూజలు, పునస్కారాలు, హోమాలు చేస్తూ.. తమ కడుపున ఒక కాయ కాయించేలా చేయమని భగవంతుడిని ప్రార్ధిస్తూ వుంటారు. అయితే ఉత్తరప్రదేశ్లో (uttar pradesh) ఓ మహిళ మాత్రం అబార్షన్ కోసం తనకు అనుమతి ఇవ్వాలని ఏకంగా కోర్టును ఆశ్రయించింది. ఆమె చెప్పిన నిజాలు విని న్యాయమూర్తి సైతం ఆశ్చర్యపోయారు.
వివరాల్లోకి వెళితే... ఉత్తరప్రదేశ్ రాష్ట్రం జలౌన్ పరిధికి చెందిన యువతికి మలన్పూర్ పరిధికి చెందిన యువకుడితో 2021 జూన్లో వివాహమైంది. ఈ దంపతులు తల్లిదండ్రులతో కలిసి నివాసం ఉంటున్నారు. సాఫీగా సాగిపోతున్న వీరి సంసారంలో మొన్నటి వరకు ఎలాంటి సమస్యలూ లేవు. అయితే ఇటీవల మహిళపై ఆమె మామ కన్నేశాడు. ఈ క్రమంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో ఓ రోజు కోడలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీని కారణంగా కొన్ని నెలల తర్వాత ఆమె గర్భం దాల్చింది. తనపై మామ చేసిన అఘాయిత్యంపై భర్త, కుటుంబ సభ్యులకు తెలియజేసింది.
అనంతరం తనకు అబార్షన్కు (abortion) అనుమతి ఇవ్వాలని బాధితురాలు కోర్టును ఆశ్రయించింది. కోర్టులో ఆమె చెప్పింది విని అంతా షాక్ అయ్యారు. అయితే బాధితురాలు గర్భం దాల్చడానికి ఆమె మామ కారణం కాదని తెలిస్తే.. ఫిర్యాదుదారుపై చర్యలు తప్పవని కోర్టు హెచ్చరించింది. అనంతరం విచారణను ఈ నెల 26వ తేదీకి వాయిదా వేసింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశమైంది.