దారుణం.. కూతురి కంటే బాగా చదువుతున్నాడని.. విద్యార్థిపై విషప్రయోగం.. ఓ తల్లి క్రూరత్వం...
కూతురికంటే బాగా చదువుతున్నాడని ఓ తల్లి దారుణానికి ఒడిగట్టింది. విషప్రయోగం చేసి తోటి విద్యార్థిని చంపింది. దీంతో ఆమెను అరెస్ట్ చేశారు.
చెన్నై : తమ పిల్లలే అందరికంటే బాగా చదువుకోవాలని.. అన్నింట్లోనూ ముందుండాలని ప్రతీ తల్లీదండ్రులు ఆశపడతారు. దీనికోసం పిల్లల్ని మోటివేట్ చేస్తారు. కొన్నిసార్లు ఇబ్బందికి కూడా గురిచేస్తారు. అయితే ఈ తల్లిమాత్రం వీరందరికంటే భిన్నంగా ఆలోచించింది. తన కూతురి కంటే ఎవ్వరూ బాగా చదవొద్దనుకుంది. అలాంటి వారు భూమిమీదనే ఉండొద్దనుకుంది. తల్లి స్థానంలో ఉండి అత్యంత క్రూరంగా ఆలోచించింది. తోటి విద్యార్థి కూడా మరో తల్లి కన్నబిడ్డే అని మరిచిపోయింది. తన కూతరు కంటే బాగా చదువుతున్నాడని విషం పెట్టి చంపేసింది.
షాక్ కలిగించే ఈ ఘటన తమిళనాడులోకి కారైకాల్ లో జరిగింది. కారైకాల్ లో ఓ విద్యార్థి మరణించిన కేసులో తోటి విద్యార్థిని తల్లిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. కారైకాల్ కు చెందిన బాల మణికంఠన్ (13)పై సహ విద్యార్థిని తల్లి విషప్రయోగం చేసినట్టు బాధితుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసిన విసయం తెలిసిందే. కారైకాల్ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు ఆదివారం మరణించాడు.
దీంతో బాలుడి బంధువులు ఆసుపత్రిని ముట్టడించి విధ్వంసానికి పాల్పడ్డారు. సరైన చికిత్స అందించకపోవడంతోనే బాలుడు మరణించాడంతూ కామరాజర్ రోడ్డులో హిందూ మున్నాని కార్యకర్తలతో కలిసి రాస్తారోకోకు దిగారు. పోలీసులు చర్చించి నిరసనకారులను శాంతింపచేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. తన కుమార్తెకన్నా బాగా చదువుతున్నాడనే అక్కసుతో విషం కలిపిన శీతల పానీయాన్ని పాఠశాల వాచ్ మెన్ ద్వారా బాలా మణికంఠన్ కు ఇచ్చినట్టు మహిళ మీద ఆరోపణలున్నాయి.