రోహిత్ తివారీ హత్య: రెండు నిమిషాల్లోనే, మరో మహిళ వల్లనే..
డిన్నర్ గురించి అడిగేందుకు అపూర్వ రోహిత్ కు వీడియో కాల్ చేసింది. ఆ సమయంలో కారులో మరో మహిళ ఉంది. అపూర్వకు ఆమె కనిపించకుండా రోహిత్ శేఖర్ తివారీ ప్రయత్నించాడు.
న్యూఢిల్లీ: రోహిత్ శేఖర్ తివారీతో ఆయన భార్య అపూర్వ గొడవ పడడం, అది కాస్తా హత్యకు దారి తీయడం కేవలం రెండు నిమిషాల్లో జరిగిపోయిందని అంటున్నారు. అయితే తన భర్తను భార్య అపూర్వ హత్య చేసిందనే విషయాన్ని నిర్ధారించడానికి పోలీసులకు వారం రోజులు పట్టింది.
రోహిత్ శేఖర్ హత్య జరగడానికి ఒక్క వీడియో కాల్ కారణమని పోలీసులు అంటున్నారు.ఈ నెల 15న రోహిత్ ఉత్తరాఖండ్ నుంచి ఢిల్లీకి కారులో వస్తున్నాడు. అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి- డిన్నర్ గురించి అడిగేందుకు అపూర్వ రోహిత్ కు వీడియో కాల్ చేసింది. ఆ సమయంలో కారులో మరో మహిళ ఉంది.
అపూర్వకు ఆమె కనిపించకుండా రోహిత్ శేఖర్ తివారీ ప్రయత్నించాడు. అయితే గాజుల శబ్దం వినిపించింది. దుస్తులు అపూర్వకు కనిపించాయి. రాత్రి 10 గంటలకు రోహిత్, ఆయన తల్లి ఉజ్వల తివారీ, ఇతర బంధువులు కలిసి ఢిల్లీలోని ఇంటికి చేరుకున్నారు.
మద్యం మత్తులో ఉన్న రోహిత్కు అపూర్వ భోజనం వడ్డించింది.అరగంట తర్వాత మాట్లాడాలంటూ రోహిత్ దంపతులను ఉజ్వల పిలిచింది. కొద్దిసేపటికి రోహిత్ తనకు బాగాలేదంటూ గదిలోకి వెళ్లిపోయాడు. అర్ధరాత్రి 12.45 గంటలకు అపూర్వ భర్త గదిలోకి వెళ్లి కారులోని మహిళ గురించి నిలదీసింది.
అయితే, ఆమె, తాను ఒకే గ్లాసులో మద్యం తాగామని రోహిత్ చెప్పాడు. అంతే ఆయన మీద పడి గొంతు పట్టుకొని ఊపిరాడకుండా చేసింది. మద్యం మత్తుతో పాటు బలహీనంగా ఉండడంతో రోహిత్ ప్రతిఘటించలేకపోయాడు. కేవలం రెండు నిమిషాల్లోనే అతను మరణించాడు.
రోహిత్ మరణించిన తర్వాత కూడా అపూర్వ దాదాపు గంటకు పైగా అక్కడే ఉండిపోయింది. ఉదయం 9 గంటలకు పనిమనిషి గోలు రోహిత్ గదిలోకి వెళ్లాడు. అయితే అతను నిద్రపోతున్నాడనుకొని తిరిగి వచ్చేశాడు. తిలక్ లేన్లోని ఇంటికి వెళ్లిన ఉజ్వల రోహిత్తో మాట్లాడేందుకు ప్రయత్నించింది. అతను నిద్రపోతున్నాడని అపూర్వ చెబుతూ వచ్చింది.
శేఖర్ ను లేపాలని మధ్యాహ్నం 3.30 గంటలకు ఉజ్వల గోలుకు చెప్పింది. అయితే రోహిత్ ఎంతకీ లేవడం లేదని, ముక్కులో నుంచి రక్తం కారుతోందని చెప్పాడు. దాంతో వెంటనే రోహిత్ శేఖర్ ను ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే అతను ప్రాణాలు కోల్పోయాడదని వైద్యులు తేల్చారు.