కరోనా ఎఫెక్ట్.. టాయ్ లెట్ లోనే హోం క్వారంటైన్..
ఒడిశాలోని లాక్డౌన్ నిబంధనల ప్రకారం ఏడు రోజులు ఇన్స్టిట్యూషనల్ క్వారంటైన్ సెంటర్లో ఉండాలి. మరో ఏడు రోజులు హోం క్వారెంటైన్లో ఉండాలి.
కరోనా వైరస్ ప్రపంచ దేశాలను పట్టిపీడిస్తోంది. ఈ వైరస్ కారణంగా ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. కాగా.. ఈ వైరస్ కారణంగా ఓ వలస కార్మికుడు నరకం అనుభవించాడు. హోం క్వారంటైన్ టాయ్ లెట్ లోనే ఉండాల్సి వచ్చింది. ఈ సంఘటన ఒడిశాలో చోటుచేసుకోగా పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఒడిశాలోని జగత్సింగ్పూర్ తాలూకాలోని జముగాన్ గ్రామానికి చెందిన మానస్ పత్రా తమిళనాడులోని ఓ కంపెనీలో పనిచేసేవాడు. లాక్డౌన్ కారణంగా ఉపాధి లేకపోవడంతో గత వారం గ్రామానికి తిరిగి వెళ్లాడు. ఒడిశాలోని లాక్డౌన్ నిబంధనల ప్రకారం ఏడు రోజులు ఇన్స్టిట్యూషనల్ క్వారంటైన్ సెంటర్లో ఉండాలి. మరో ఏడు రోజులు హోం క్వారెంటైన్లో ఉండాలి.
ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్ సెంటర్లో ఏడు రోజుల క్వారంటైన్ ముగిశాక మానస్ పత్రా ఇంటికెళ్లాడు. అయితే.. ఇంట్లో ఆరుగురు కుటుంబ సభ్యులు ఉండటం.. ఇంట్లో అతనొక్కడూ ప్రత్యేకంగా ఉండేంత స్థలం లేకపోవడంతో ఏడు రోజుల నుంచి పత్రా టాయ్లెట్లోనే హోం క్వారంటైన్ను ముగించాడు. ఈ 14 రోజుల వ్యవధిలో పత్రాలో కరోనా లక్షణాలు కనిపించలేదు.