పెద్ద కొడుకు ఎంపీ, చిన్న కొడుక్కి ఎమ్మెల్యే టికెట్.. ఇది వారసత్వ రాజకీయం కాదా?: యెడియూరప్ప షాకింగ్ ఆన్సర్
పెద్ద కొడుకు ఎంపీ, చిన్న కొడుక్కి ఎమ్మెల్యే టికెట్ ఇప్పించారు.. ఇది వారసత్వ రాజకీయ కాదా? అని కర్ణాటక మాజీ సీఎం బీఎస్ యెడియూరప్పను ప్రశ్నించగా ఆయన షాకింగ్ ఆన్సర్ ఇచ్చారు. తాను ఎన్నికల రాజకీయాల నుంచి రిటైర్ అయ్యాక కొడుకు పోటీ చేయడాన్ని వారసత్వ రాజకీయంగా చూడరాదని పేర్కొన్నారు.
![with my retirement, sons contesting can not be called dynastic politics says bs yediyurappa kms with my retirement, sons contesting can not be called dynastic politics says bs yediyurappa kms](https://static-ai.asianetnews.com/images/01gpbw00tnkm2f0z8h6fqtn0ec/bs-yediyurappa_363x203xt.jpg)
శివమొగ్గ: బీజేపీ ప్రతిపక్షాలపై ప్రధానంగా చేసే ఆరోపణ వారసత్వ రాజకీయాలు, కుటుంబ పాలన. ఎదుటి పార్టీని వారసత్వ రాజకీయాలు చేస్తున్నదని విమర్శిస్తున్న బీజేపీ కూడా అదే విధానాన్ని అవలంభిస్తున్నట్టు పలు సందర్భాల్లో బయటపడింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ చర్చ జరుగుతున్నది. అయితే.. కర్ణాటక మాజీ సీఎం యెడియూరప్ప కొడుకుకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడంపై ప్రశ్నలు వస్తున్నాయి. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో యెడియూరప్ప ఈ ప్రశ్నపై స్పందించారు.
ఈ సారి శికారిపురలో యెడియూరప్ప కొడుకు బీఎస్ విజయేంద్ర పోటీ చేస్తున్నారు. అంటే.. బీఎస్ విజయేంద్రను తన వారసుడిగా యెడియూరప్ప ప్రకటించినట్టేనా? అని ప్రశ్నించగా సమాధానం ఇలా ఇచ్చారు.
కొడుకు విజయేంద్రను రాజకీయ వారసుడిగా ప్రకటించినట్టు కాదు అని, కానీ, శికారిపురలో తన స్థానాన్ని భర్తీ చేయాల్సి వచ్చిందని, అందుకే విజయేంద్రకు టికెట్ ఇచ్చారని వివరించారు. తాను ఇక్కడ 50 ఏళ్లుగా రాజకీయాలు చేశానని తెలిపారు. తన స్థానాన్ని ఎవరితో భర్తీ చేయడం సరైనదని సీనియర్ క్యాడర్, పార్టీ వర్కర్లను అడగ్గా.. వారి నుంచి వచ్చిన ఏకైక పేరు విజయేంద్ర అని యెడియూరప్ప తెలిపారు.
పెద్ద కొడుకు రాఘవేంద్ర ఎంపీ.. అలాగే చిన్న కొడుక్కి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడంతో వారసత్వ రాజకీయాల ప్రశ్న ఉదయిస్తుంది కదా అని ప్రశ్నించగా.. తాను ఎన్నికల రాజకీయాల్లో క్రియా శీలంగా ఉంటేనే వారసత్వ రాజకీయాల ప్రశ్న వస్తుందని యెడియూరప్ప అన్నారు. తాను రిటైర్ మెంట్ తీసుకున్న తర్వాత కొడుకు విజయేంద్ర పోటీ చేయడాన్ని వారసత్వ రాజకీయంగా సరిపోల్చలేమని యెడియూరప్ప తెలిపారు. రాఘవేంద్ర ఒక ఎంపీ.. ఆయన తన పని తాను కొనసాగిస్తాడు అని వివరించారు.
యెడియూరప్ప లాజిక్ పై సోషల్ మీడి యాలో వ్యంగ్యంగా వ్యాఖ్యలు వస్తున్నాయి. ఈ కొత్త లాజిక్ భలేగుందని అంటున్నారు.