ప్రతిపక్షాలతో తాము కలవబోమని ఒడిశా సీఎం, బీజేడీ చీఫ్ నవీన్ పట్నాయక్ స్పష్టం చేశారు. ప్రధాని మోడీతో ఢిల్లీలో కలిసిన తర్వాత ఈ స్పష్టత ఇచ్చారు. ప్రతిపక్షాల ఐక్యత ప్రయత్నాలకు ఆయన ఝలక్ ఇచ్చారు.  

న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల కోసం బీజేపీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షాలన్నీ ఏకం కావడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రతిపక్షాలను ఏక తాటి మీదికి తేవడానికి బిహార్ సీఎం, జేడీయూ చీఫ్ నితీష్ కుమార్ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. పలువురు ప్రతిపక్ష నేతలతో ఆయన సమావేశమవుతూ ఏక తాటి మీదికి తెచ్చే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇటీవలే ఆయన ఒడిశా సీఎం, బీజేడీ చీఫ్ నవీన్ పట్నాయక్‌తోనూ కలిశారు. అనంతరం, ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవార్‌లను కలవడానికి మహారాష్ట్రకు వెళ్లారు. అయితే, ప్రతిపక్షాల ప్రయత్నాలకు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ఝలక్ ఇచ్చారు.

ప్రతిపక్షాల కూటమిలో బీజేడీ చేరబోదని నవీన్ పట్నాయక్ తాజాగా వెల్లడించారు. 2024 ఎన్నికల్లో బీజేడీ ఒంటరిగా వెళ్లుతుందని తెలిపారు. ఈ రోజు సాయంత్రం నవీన్ పట్నాయక్ దేశ ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. ఇది మర్యాదపూర్వక భేటీ అని ఆయన తెలిపారు. అధికార, ప్రతిపక్షాలకు సమాన దూరంలో ఉంటారా? అని ప్రశ్నించగా.. అదే ఎప్పుడూ అనుసరించే ప్రణాళిక కదా అని నవీన్ పట్నాయక్ అన్నారు.

Also Read: బ్రిటన్ ఎంపీలు ప్రశంసించారన్నది బీఆర్ఎస్ అసత్య ప్రచారం: టీపీసీసీ ఎన్నారై సెల్

76 ఏళ్ల నవీన్ పట్నాయక్ ఎన్‌డీఏకు, కాంగ్రెస్‌కు సమాన దూరాన్ని పాటిస్తున్నారు. ఆ విధానం ఎప్పుడూ మారదని వివరించారు. నితీష్ కుమార్‌తో సమావేశమైన రెండో రోజుకే ఈ కామెంట్ చేశారు.

ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు‌ను భువనేశ్వర్ నుంచి పూరికి తరలించాలని ప్రధాని మోడీని కోరినట్టు నవీన్ పట్నాయక్ అన్నారు. వీలైన మేరకు ఆ విషయంలో సహకరిస్తానని ప్రధాని మోడీ తెలిపినట్టు వివరించారు.

ప్రధాని మోడీని కలిసిన తర్వాత కూడా ప్రతిపక్ష నేతలను కలవబోనని స్పష్టం చేశారు. నిజానికి ఈ ఢిల్లీ పర్యటనలోనే కేజ్రీవాల్, భగవంత్ మాన్, కేసీఆర్, ఎంకే స్టాలిన్‌లనూ కలుస్తారనే వార్తలు వచ్చాయి.