రాజ్యాంగ పరిరక్షణ.. ప్రజాస్వామ్య బలోపేతం కోసం పోరాడుతా.. : మార్గరెట్ అల్వా
Margaret Alva: ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి మద్దతివ్వడం ద్వారా అలాంటి పార్టీలు, నేతలు తమ విశ్వసనీయతను దెబ్బతీశారని విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థి మార్గరెట్ అల్వా అన్నారు. కాగా, ఉమ్మడి ప్రతిపక్షాల స్ఫూర్తికి గౌరవం, హుందాతనంతో ప్రాతినిధ్యం వహించినందుకు ఆల్వాకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కృతజ్ఞతలు తెలిపారు.
Vice Presidential election: ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అధికార భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నేతృత్వంలోని ఎన్డీయే కూటబి అభ్యర్థి జగదీప్ ధంఖర్ విజయం సాధించారు. ఈ క్రమంలోనే ప్రతిపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థి మార్గరెట్ అల్వా ఆయనకు అభినందనలు తెలిపారు. అయితే, ఈ ఎన్నికలు ముగిసినప్పటికీ, రాజ్యాంగాన్ని పరిరక్షించడం, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడం, పార్లమెంటు గౌరవాన్ని పునరుద్ధరించడం కోసం తన పోరాటం కొనసాగుతుందని ఆమె పేర్కొన్నారు. కాగా, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అధికార బీజేపీ అభ్యర్థికి పలు ప్రతిపక్ష పార్టీలు సైతం మద్దతు ప్రకటించాయి. వారిపై మార్గరెట్ అల్వా విమర్శలు గుప్పించారు. వారు తమ విశ్వసనీయతను దెబ్బతీశారని పేర్కొన్నారు.
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా బీజేపీకి మద్దతు ఇచ్చినందుకు కొన్ని ప్రతిపక్ష పార్టీలపై మార్గెర్ అల్వా విమర్శలు గుప్పించారు. ఇది ఐక్య ప్రతిపక్షం ఆలోచనను దెబ్బతీసే ప్రయత్నం అని అన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి మద్దతివ్వడం ద్వారా అలాంటి పార్టీలు, నేతలు తమ విశ్వసనీయతను దెబ్బతీశారని తాను నమ్ముతున్నానని అల్వా అన్నారు. ఫలితాలు ప్రకటించిన వెంటనే అల్వా ధనఖర్కు తన శుభాకాంక్షలను ట్విట్టర్ ద్వారా అందజేశారు. “వైస్ ప్రెసిడెంట్గా ఎన్నికైనందుకు మిస్టర్ ధంఖర్కు అభినందనలు! ఈ ఎన్నికల్లో నాకు ఓటు వేసిన ప్రతిపక్ష నేతలందరికీ, పార్టీలకతీతంగా ఎంపీలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని ట్వీట్ చేశారు.
అలాగే, ప్రతిపక్ష పార్టీల మధ్య ఐక్యత లేకపోవడం నిరాశకు గురిచేసిన విషయాన్ని ఆమె ప్రస్తావించారు. “ఈ ఎన్నికలు ప్రతిపక్షాలు కలిసి పనిచేయడానికి, గతాన్ని విడిచిపెట్టి, ఒకరి మధ్య నమ్మకాన్ని పెంచుకోవడానికి ఒక అవకాశం. దురదృష్టవశాత్తు, కొన్ని ప్రతిపక్ష పార్టీలు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా బీజేపీకి మద్దతునిచ్చాయి. ఐక్య ప్రతిపక్షం ఆలోచనను నిర్వీర్యం చేసే ప్రయత్నంలో ఉన్నాయి. అలా చేయడం వల్ల ఈ పార్టీలు, వాటి నాయకులు తమ విశ్వసనీయతను దెబ్బతీశారని నా నమ్మకం అని పేర్కొన్నారు. కాగా, జనతాదళ్ (యునైటెడ్), వైఎస్ఆర్సీపీ, బీఎస్పీ, ఏఐఏడిఎంకె, శివసేన వంటి అనేక ప్రతిపక్ష పార్టీలు ధంఖర్కు మద్దతు పలికాయి. అల్వా పేరును నిర్ణయించే సమయంలో సంప్రదింపులు జరగలేదని ఆరోపిస్తూ మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ ఓటింగ్కు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. అయితే, ఇద్దరు ఎంపీలు ఓటు వేశారు.
“ఈ ఎన్నికలు ముగిశాయి. మన రాజ్యాంగాన్ని పరిరక్షించడం, మన ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడం, పార్లమెంటు గౌరవాన్ని పునరుద్ధరించడం కోసం పోరాటం కొనసాగుతుంది” అని మార్గరెట్ అల్వా అన్నారు. ఈ క్రమంలోనే ఉమ్మడి ప్రతిపక్షాల స్ఫూర్తికి గౌరవం, హుందాతనంతో ప్రాతినిధ్యం వహించినందుకు ఆల్వాకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పదవీకాలం ముగిసిన మరుసటి రోజు ఆగస్టు 11న ధంఖర్ ప్రమాణస్వీకారం చేయనున్నారు.