కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అగ్నిపథ్ స్కీంపై దేశవ్యాప్తంగా హింసాత్మక ఆందోళనలు జరుగుతున్నాయి. ఆర్మీ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఈ స్కీంను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇంతకీ ఈ అభ్యర్థులు వేటిపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారో తెలుసుకుందాం.
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఆర్మీ రిక్రూట్మెంట్లో గణనీయమైన మార్పులు తెస్తూ అగ్నిపథ్ స్కీం ప్రకటించింది. ఈ స్కీం ద్వారా ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్లోనూ నియామకాలు చేపడుతామని ప్రకటించింది. ఈ స్కీం ద్వారా నియామకమైన వారిని అగ్నివీర్లుగా పిలుస్తామని పేర్కొంది. ఈ స్కీం కింద రిక్రూట్ అయిన అగ్నివీర్లు నాలుగేళ్లు షార్ట్ సర్వీస్ మాత్రమే చేస్తారు. ఆ తర్వాత రిటైర్మెంట్ తీసుకుంటారు. అయితే, నాలుగేళ్ల తర్వాత అందరినీ ఇంటికి పంపరు. ఆర్మీలో లాంగ్ టర్మ్ సర్వీస్ చేయాలని స్వచ్ఛందంగా దరఖాస్తు చేసుకున్నవారిని పరీక్షించి నియమిత సంఖ్యలో చేర్చుకుంటారు. అయితే, ఈ స్కీం ప్రకటించిన ఒకట్రెండు రోజుల్లో కొన్ని రాష్ట్రాలు అగ్నిగుండం అయ్యాయి. ఆర్మీ ఉద్యోగ అభ్యర్థులు తీవ్ర ఆందోళనలు చేశారు. రోడ్లును దిగ్బంధించడం, వాహనాలను ధ్వంసం చేయడం, ట్రైన్లకు నిప్పు అంటించడం చేశారు. ఈ ఆందోళనలు హింసాత్మకం కావడంతో కొందరు మరణించారు కూడా. ఈ నేపథ్యంలోనే ఇంతకు ఈ హింసాత్మక ఆందోళనలు ఎందుకు జరుగుతున్నాయి? అగ్నిపథ్ స్కీంపై అభ్యర్థులకు ఉన్న అసంతృప్తి ఏమిటీ? ఓ సారి చూద్దాం.
అగ్నిపథ్ పథకం గురించి నిరసనకారుల నుంచి వినిపిస్తున్న ప్రధానమైన అసంతృప్త వ్యాఖ్యలు రెండు. ఒకటి ఉద్యోగ భద్రత. రెండోది పెన్షన్లు. అగ్నిపథ్ స్కీంకు ముందు రిక్రూట్మెంట్ చేసుకున్న వారికి 17 ఏళ్ల సర్వీసు ఉండేది. అందులోనూ కొందరు తమ సర్వీసు వ్యవధిని మరికొంత పెంచుకోవడానికి వెసులుబాటు ఉండేది. వీరికి జీవితాంతం పెన్షన్ లభించేది.
కానీ, కొత్త స్కీం ప్రకారం, అగ్నివీర్లు కేవలం నాలుగు సంవత్సరాలు మాత్రమే ఉద్యోగాలు చేస్తారు. ఆ తర్వాత చాలా మంది అగ్నివీర్లు రిటైర్ కావాల్సిందే. వారికి పెన్షన్లు ఉండవు. గతంలో తాము ఆర్మీ ఉద్యోగాల కోసం నాలుగు ఐదు సంవత్సరాలు కష్టపడేవారిమి అని నిరసనకారులు చెబుతున్నారు. తద్వారా ఉద్యోగం పొంది రిటైర్ అయ్యాక జీవితాంతం పెన్షన్లు కూడా వచ్చేవని అంటున్నారు. తమ ప్రిపేరేషన్కు కేటాయించిన సమయం కూడా తమ ఉద్యోగానికి ఉండకుంటే ఎలా అని నిలదీస్తున్నారు. అది కూడా నాలుగేళ్ల తర్వాత మళ్లీ నిరుద్యోగిగా బయటకు రావాల్సి ఉంటుందని అంటున్నారు.
ఈ పథకం ద్వారా రిక్రూట్ అయితే.. ఉద్యోగాలకు పంపడానికి తమ తల్లిదండ్రులు కూడా వెనుకాడతారని బిహార్కు చెందిన నిరసనకారుడు మోహన్ కుమార్ చెప్పాడు.
బిహార్లోనే కోచింగ్ సెంటర్ నిర్వహిస్తున్న ఎస్ కే ఝా మాట్లాడుతూ, నాలుగేళ్ల తర్వాత రిటైర్ అవుతారనే ఒక విషయాన్ని ఒక సారి ఊహించుకోండని అన్నాడు. ఇది కేవలం ఎమోషన్స్తో ఆడుకోవడమేనని చెప్పాడు. వారికి కొన్ని నైపుణ్యాలు ఇచ్చి రిటైర్ కావాలని చెప్పడం ఎంతవరకు సమంజసం అని పేర్కొన్నాడు. అందుకే పాత రిక్రూట్మెంట్ వ్యవస్థనే మళ్లీ రావాలని స్టూడెంట్లు కొట్లాడుతున్నారని చెప్పాడు.
అంతేకాదు, కరోనా కారణంగా రెండేళ్లు ఆర్మీ రిక్రూట్మెంట్ నిలిచిపోయింది. ఈ కాలంలో ఆర్మీలోకి వెళ్లాలని అనుకున్నవారు నిజానికి ఓవర్ ఏజ్ అయ్యారు. అంటే వయో పరిమితిని దాటారు. వారు వయోపరిమితిని రెండేళ్లు తమకు పెంచుతారనే ఆశలో ఉన్నారు. కానీ, అగ్నిపథ్ స్కీంతో ఆ వయోపరిమితి అంతే ఉంచారు. ఇది కూడా చాలా మంది అభ్యర్థులకు ఆగ్రహానికి తెప్పించింది.
అయితే, తాజాగా కేంద్రం అగ్నిపథ్ స్కీం కింద వయోపరిమితిని 21 ఏళ్ల నుంచి 23 ఏళ్లకు అంటే రెండేళ్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
అంతేకాకుండా.. రెండేళ్లు రిక్రూట్మెంట్లు చేపట్టకుండా తాజాగా, నాలుగేళ్ల ఉద్యోగం మాత్రమే అని చేసిన ప్రకటన కూడా వారి ఆగ్రహానికి కారణం అయినట్టుగా వారు చెబుతున్నారు. అంతేకాదు, ఆర్మీలో చేరాలని కలలు కనేవారికీ ఈ స్కీం నచ్చడం లేదని, నాలుగేళ్లతోనే తమ కలలు కల్లలు అవుతాయని బాధపడుతున్నారు.
