Asianet News TeluguAsianet News Telugu

Note Ban: ఏడేళ్లలోనే రూ. 2000 నోట్లను ఆర్బీఐ ఎందుకు రద్దు చేస్తున్నది? వివరణ ఏం ఇచ్చింది?

రూ. 2,000 నోట్లను రద్దు చేస్తామని ఆర్బీఐ శుక్రవారం సంచలన ప్రకటన చేసింది. మార్చి 23వ తేదీ నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు వీటిని బ్యాంకుల్లో మార్పిడి లేదా డిపాజిట్ చేసుకోవచ్చని తెలిపింది. 2016లోనే అందుబాటులోకి తెచ్చిన ఈ నోట్లను ఇప్పుడు ఎందుకు రద్దు చేయాలని నిర్ణయించుకుంది? ఆర్బీఐ ఏమని వివరణ ఇచ్చింది?
 

why RBI took decision to with draw rs 2000 denominations from circulation? what RBI has to say?
Author
First Published May 19, 2023, 8:15 PM IST

న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుక్రవారం సంచలన ప్రకటన చేసింది. రూ. 2000 నోట్లను ఉపసంహరిస్తామని తెలిపింది. అయితే.. ఇప్పటికిప్పుడే వీటిని రద్దు చేయడం లేదు. ఇవి చెలామణిలో ఉంటాయని తెలిపింది. సెప్టెంబర్ 30వ తేదీ  వరకు ఈ నోట్లను బ్యాంకుల్లో మార్చుకోవచ్చని పేర్కొంది. లేదా.. తమ అకౌంట్‌లో డిపాజిట్ చేసుకోవాలని తెలిపింది. అలాగే.. రూ. 2,000 నోట్లను ఖాతాదారులకు జారీ చేయవద్దని తక్షణ ఆదేశాలు ఇచ్చింది. ఇంతకీ ఈ నిర్ణయం ఆర్బీఐ ఎందుకు తీసుకున్నది? ఈ నిర్ణయంపై ఏమంటున్నది?

2016లో కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసింది. అప్పుడే కొత్తగా రూ. 2000 నోట్లను ఆర్బీఐ ప్రవేశపెట్టింది. ఇంతలోనే వీటిని ఎందుకు రద్దు చేశారనే అనుమానాలు వస్తున్నాయి. ఇందుకు ఆర్బీఐ స్పష్టంగా వివరణ ఇచ్చింది.

89 శాతం 2000 నోట్లు 2017 మార్చికి ముందే చెలామణిలోకి తెచ్చినట్టు ఆర్బీఐ తెలిపింది. వాటి లైఫ్ స్పాన్ (నాలుగు నుంచి ఐదు సంవత్సరాలు) త్వరలో పూర్తయిపోతుందని ఆర్బీఐ తన నోటిఫికేషన్‌లో పేర్కొంది.

2016 నవంబర్‌లో రూ.500, రూ. 1,000 నోట్లను రద్దు చేసినప్పుడు వెంటనే రూ. 2,000 నోట్లను అందుబాటులోకి తెచ్చారు. పెద్ద మొత్తంలో నగదు రద్దు కావడంతో ప్రజల అవసరాలకు సరిపడా నగదు తక్కువ కాలంలో అందుబాటులోకి తెచ్చే క్రమంలో రూ. 2,000 నోట్లను ప్రవేశపెట్టారు. ఇతర డినామినేషన్లు (ఇతర నోట్లు) సరిపడా అందుబాటులోకి వచ్చాయని, కాబట్టి, రూ.2,000 అవసరం పూర్తయిందని ఆర్బీఐ తెలిపింది. 2018- 19లోనే రూ.2,000 నోట్ల ముద్రణ నిలిపేసినట్టు వివరించింది.

Also Read: రూ. 2000 నోటు ఉపసంహరణ .. రిజర్వ్ బ్యాంక్ సంచలన ప్రకటన, మార్పిడికి డెడ్‌లైన్

ఆర్బీఐ నిర్ణయంపై కొన్ని ముఖ్యమైన పాయింట్లు

01. రూ.2000 నోట్ల ఉపసంహరణ నిర్ణయాన్ని ఆర్బీఐ అనుసరిస్తున్న క్లీన్ నోట్ పాలసీ కింద తీసుకుంది. అయితే, ఈ నోటు మాత్రం చెలామణిలోనే ఉన్నది.

02.  రూ. 2000 బ్యాంకు నోట్లను సాధారణ లావాదేవీలకు ఎక్కువగా వినియోగించడం లేదు. వీటి వినియోగం క్రమంగా తగ్గిపోయింది. 2018 మార్చి 31వ తేదీ నాటికి ఈ నోట్ల వినియోగం 6.73 లక్షల కోట్ల నుంచి 3.62 లక్షల కోట్లకు (37.3 శాతం నోట్లు మాత్రమే చెలామణిలో ఉన్నాయి) పడిపోయింది. అదే 2023 మార్చి 31వ తేదీ నాటికి రూ. 2000 నోట్ల చెలామణి 10.8 శాతానికి క్షీణించింది.

03. ఇతర డినామినేషన్ నోట్లు ప్రజల అవసరాలకు సరిపడేట్టుగా ఉన్నాయి.

04. రూ.2000 నోట్లను బ్యాంకుల్లో వెనక్కి ఇచ్చేయవచ్చు. లేదా ఇతర డినామినేషన్ (రూ. 500, రూ.200, రూ.100... నోట్లతో మార్చుకోవచ్చు) నోట్లతో మార్పిడి చేసుకోవచ్చు.

05. ఒక్కసారి ఈ మార్పిడి (అంటే రూ. 2000 నోట్లను ఇచ్చి ఇతర డినామినేషన్ నోట్లను తీసుకోవడం) రూ. 20,000 వరకు చేసుకోవచ్చు. సెప్టెంబర్ 30వ తేదీ వరకు వీటిని ఎక్స్‌చేంజ్ లేదా డిపాజిట్ చేసుకునే అవకాశం ఇచ్చింది.

06. రూ.2000 నోట్లను ఇష్యూ చేయడాన్ని వెంటనే ఆపేయాలని బ్యాంకులకు ఆర్బీఐ తక్షణ ఆదేశాలు జారీ చేసింది. మార్చి 23 నుంచి రూ. 2,000 నోట్ల మార్పిడి లేదా వెనక్కి ఇచ్చే ప్రక్రియ మొదలవుతుంది.

Follow Us:
Download App:
  • android
  • ios