Asianet News TeluguAsianet News Telugu

ఢిల్లీ సీఎంగా సునీతా కేజ్రీవాల్ ? ఇంతకీ ఆమె బ్యాగ్రౌండ్ ఏంటీ?  

Sunita Kejriwal:ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు కోర్టు జ్యుడీషియల్ కస్టడీ విధించడంతో ప్రస్తుతం ఆయన తీహార్ జైల్లో ఉన్నారు. ఈ తరుణంలో అరవింద్‌ కేజ్రీవాల్‌ సతీమణి సునీత తరువాత సీఎం అనే ప్రచారం జరుగుతోంది.  ఇంతకీ సునీత కేజ్రీవాల్ అర్హతలేంటీ? ఆమెకు రాజకీయ అనుభవం ఉందా? అసలు ఆమె బ్యాగ్రౌండ్ ఏంటీ?  అనే చర్చ జరుగుతోంది. 

Who is Sunita Kejriwal? All About the former IRS officer and wife of Delhi CM Arvind Kejriwal KRJ
Author
First Published Apr 3, 2024, 11:54 AM IST

Sunita Kejriwal:ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టయిన సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌  తీహార్ జైల్లో ఉన్నారు. ఈ తరుణంలో కేజ్రీవాల్‌ జైలు నుంచి కూడా పరిపాలన కొనసాగిస్తారా? లేదా సీఎం మార్పు జరుగుతుందా ? అనే పలు ఊహాగానాలు వెలువడుతున్నాయి.  ఒక వేళ సీఎం పదవికి కేజ్రీవాల్‌ రాజీనామా చేస్తే ఆయన స్థానంలో ఎవరు బాధ్యతలు చేపడతారనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. ఇంతకీ ఢిల్లీ సర్కార్ ను నడిపే సత్తా ఎవరికి ఉంది? ఈ సంక్షోభ ప్రభుత్వాన్ని కట్టెక్కించే నాయకుడెవరు? అనేది చర్చనీయంగా మారింది. 

ఈ తరుణంలో కొంతమంది పేర్లు తెరపైకి వస్తున్నాయి. అందులో అరవింద్‌ కేజ్రీవాల్‌ సతీమణి సునీత పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. సీఎం పదవి రేసులో ఆమె పేరే ముందునుంచి వినిపిస్తోంది. ఢిల్లీ తరువాత సునీతా కేజ్రీవాల్ అనే ప్రచారం కూడా భారీ ఎత్తున  జరుగుతోంది. ఈ తరుణంలో సునీతా కేజ్రీవాత సీఎం కూర్చీని అధిరోహించడానికి ఆమెకు ఉన్న అర్హతలేంటీ? ఆమెకు రాజకీయ అనుభవం ఉందా? విద్యార్హతలేంటీ?  ఇంతకీ ఆమె బ్యాగ్రౌండ్ ఏంటీ?  అనే చర్చ జరుగుతోంది. 

సునీతా కేజ్రీవాల్ బ్యాగ్రౌండ్ ఏంటీ? 

సునీతా కేజ్రీవాల్.. 11 ఫిబ్రవరి 1966 న్యూఢిల్లీలో జన్మించారు. ఆమె తన గ్రాడ్యుయేషన్‌ను మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లోని నేషనల్ అకాడమీ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్‌లో పూర్తి చేశారు. ఆ తరువాత  జువాలజీలో మాస్టర్స్ డిగ్రీని పొందారు. 1994లో సివిల్స్ ఎక్జామ్ లో విజయం సాధించి ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ (IRS)లో ఉద్యోగం సాధించారు. భోపాల్‌లో జరిగిన సివిల్ సర్వీసెస్ ట్రైనింగ్ సమయంలోనే ఆమెకు అరవింద్ కేజ్రీవాల్‌తో తొలిసారి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం స్నేహంగా.. ప్రేమగా మారింది. ఈ తరుణంలో వారిద్దరూ  పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కానీ తొలుత పెద్దలు అంగీకరించలేదు. కానీ ఆ తరువాత వారికి  ఒప్పించి 1994 నవంబర్‌లో కేజ్రీవాల్, సునీత వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత 1995లో ఐఆర్ఎస్ శిక్షణ పూర్తి చేసి ఉద్యోగాల్లో చేరారు. ఆమె తన కెరీర్ లో దాదాపు 22 సంవత్సరాల పాటు ఆదాయపు పన్నుశాఖలో వివిధ హోదాల్లో పనిచేశారు. ఇక 2016లో తన ఉద్యోగానికి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. చివరిసారిగా ఢిల్లీలోని ఆదాయపు పన్ను అప్పిలేట్ ట్రైబ్యునల్‌లో ఐటీ కమిషనర్‌గా పనిచేశారు. 
  
కేజ్రీవాల్ కు వెన్నుదన్నుగా.. 
 
సునీతా కేజ్రీవాల్ 2016లో వాలంటరీ రిటైర్మెంట్‌ తీసుకున్నప్పటినుంచి ఆమె తన భర్తకు అండగా నిలుస్తూ వస్తున్నారు. 2020 ఎన్నికల్లో కేజ్రీవాల్‌ మూడోసారి ఢిల్లీ సీఎం పీఠాన్ని అధిష్టించడంలో  ఆమె పాత్ర చాలా కీలకం. ఈ ఎన్నికల్లో ఆమె ఎంతో శ్రమించారు. ఈ ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొన్నారామె. పంజాబ్‌ సీఎం అభ్యర్థి భగవంత్‌మాన్‌కు మద్దతుగా కూడా ప్రచారంలో పాల్గొన్నారు. అంతకముందు ఉద్యోగం చేస్తూ ఇండియా ఎగైనెస్ట్ కరప్షన్ ఉద్యమం, ఆమ్ ఆద్మీ పార్టీ ఏర్పాటులో తనవంతు పాత్ర పోషించారు.ఆమ్ ఆద్మీ పార్టీలో ప్రత్యక్షంగా, పరోక్షంగా కీలకపాత్ర పోషిస్తున్న సునీతా కేజ్రీవాల్ సీఎం పదవికి అర్హులని అంటున్నారు ఆప్ నేతలు. 

ఉన్నత విద్యావంతురాలిగా, కేజ్రీవాల్‌ సతీమణిగా ఆమెకు అన్ని అర్హతలు ఉన్నాయని చెప్తున్నారు.తన భర్త ముఖ్యమంత్రి అయినా ఆమె అధికార బలంతో నానా హంగామా చేయడం గానీ,  అధికార దర్పాన్ని ప్రదర్శించడం గానీ ఎన్నాడూ ప్రరదర్శించలేదు. సింప్లిసిటీకి మారుపేరుగా ఉంటారామె. అలాగే.. ఢిల్లీ ప్రజల్లో ఆమెకు మంచి పేరు ఉందంటున్నారు.ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయినప్పటి నుంచి ఆయన భార్య సునీతా కేజ్రీవాల్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. అలాగే..  అరవింద్ కేజ్రీవాల్ సన్నిహితులు, ప్రభుత్వంలోని కీలక నేతలంతా అవినీతి, ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే మనీష్ సిసోడియా, సత్యేంద్రజైన్ లాంటి చెప్పుకోదగ్గ నేతలంతా జైలు జీవితాన్ని గడుపుతున్నారు. ఈ పరిస్థితుల్లో కేజ్రీవాల్ తర్వాత సీఎంగా  సునీతా కేజ్రీవాలే కనిపిస్తున్నారు.

అవరోధాలు ?

ఢిల్లీ సీఎంగా సునీతాకేజ్రీవాల్‌ బాధ్యతలు చేపట్టకుండా అడ్డంకులు లేకపోలేదు. ఈ మధ్యే ఢిల్లీ కోర్టు సునితా కేజ్రీవాల్‌కు నోటీసులు ఇచ్చింది. ఆమెకు రెండుచోట్ల ఓటు హక్కు కలిగి ఉండటంపై కోర్టు వివరణ కోరింది. ఢిల్లీలోని చాందినీ చౌక్ నియోజకవర్గంలో సునీతా కేజ్రీవాల్ ఓటర్‌గా ఉన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని సాహిబాబాద్ సెగ్మెంట్‌లో సునీతా కేజ్రీవాల్ ఓటర్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1950 ప్రకారం ఒక ఓటర్ .. రెండు చోట్ల ఓటర్ గా నమోదు చేసుకోవడం నేరం. ఈ మేరకు ఆమెకు కోర్టు సమన్లు ఇచ్చింది. ఈ ఇష్యూ సునీతా కేజ్రీవాల్ ఢిల్లీ సీఎంగా బాద్యతలు చేపట్టడానికి అడ్డంకిగా మారవచ్చు.  
 

Follow Us:
Download App:
  • android
  • ios