అర్థరాత్రి పూట పాకిస్తాన్ కి గుడ్ మార్నింగ్ చెప్పి వచ్చిన భారత సైన్యానికి ప్రాతినిధ్యం వహించిన కల్నల్ సోఫియా ఖురేషి. అసలు ఎవరీ సోఫియా...ఆమె పూర్తి వివరాలు ఏంటి..ఇక్కడ తెలుసుకుందాం.
ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ ప్రాంతంలో చోటుచేసుకున్న ఉగ్రదాడికి భారత సశస్త్ర దళాలు 15 రోజుల్లోనే ఘాటు బదులిచ్చాయి. మే 7న 'ఆపరేషన్ సిందూర్' పేరుతో భారత ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ కలిసి పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ (POK)లోని 9 ఉగ్రవాద శిబిరాలపై గాల్లోంచే ధ్వంసకరమైన దాడులు జరిపాయి. దాదాపు 90 మంది ఉగ్రవాదులు ఈ దాడుల్లో హతమయ్యారని భారత రక్షణ శాఖ మీడియాకు తెలిపింది.ఈ మీడియా సమావేశంలో వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, కర్నల్ సోఫియా కురేషి భారత దళాల ప్రాతినిధ్యం వహించారు. ఈ సందర్భంగా, కొంతమంది నెటిజన్లు "కర్నల్ సోఫియా కురేషి ఎవరు?" అనే ప్రశ్న వేస్తున్నారు.
కర్నల్ సోఫియా కురేషి ఎవరు?
గుజరాత్కు చెందిన సోఫియా కురేషి ఇండియన్ ఆర్మీ సిగ్నల్స్ కార్ప్లో అధికారి. ఆమె బయోకెమిస్ట్రీలో పీజీ పూర్తిచేసి, 1999లో చెన్నైలోని OTA (Officer Training Academy)లో శిక్షణ పూర్తిచేసి కమిషన్ పొందారు. వారి కుటుంబంలో పూర్వీకులూ సైన్యంలో ఉన్న నేపథ్యంలో, దేశ సేవ ఆమె కలగా మారింది.
ఆమె భర్త మేజర్ తాజుద్దీన్ కురేషి మెకనైజ్డ్ ఇన్ఫాంట్రీలో పనిచేస్తున్నారు. ఈ దంపతులకు 9 సంవత్సరాల కుమారుడు ఉన్నాడు. ఆమె తండ్రి , తాత సైతం ఆర్మీ సర్వీసులో ఉండటం విశేషం.
చరిత్రలోకి సోఫియా ఖురేషి
2006లో యునైటెడ్ నేషన్స్ ఆధ్వర్యంలో జరిగిన కాంగో శాంతిరక్షక మిషన్లో ఆమె భాగస్వామి కావడం గర్వకారణం. 2016లో, ఇండియాలో జరిగిన బహుళ జాతుల యుద్ధా వ్యాయామంలో భారత ఆర్మీ తరఫున బృందాన్ని నేతృత్వం వహించిన తొలి మహిళా అధికారి కావడం ద్వారా చరిత్ర సృష్టించారు.
ఆపరేషన్ సిందూర్లో కీలక భూమిక
పహల్గామ్ దాడిలో మహిళలపై జరిగిన దారుణం 'సిందూర్' అనే పదానికి అర్ధాన్ని మార్చేసింది. ఆ దాడికి జవాబుగా 'ఆపరేషన్ సిందూర్' పేరుతో జరిగిన ప్రతీకార చర్యలో సోఫియా కురేషి కీలక నాయకత్వం వహించారు. ఆమె తీక్షణమైన మాటలు, స్పష్టమైన కమ్యూనికేషన్, మరియు ధైర్యవంతమైన నిర్ణయాల కారణంగా, కొత్త తరం మహిళా అధికారులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు.
సైనిక కార్యాచరణ వివరాలు
వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ తెలిపిన ప్రకారం, పౌరులు, వారి స్థిర ఆస్తులకు హాని కలగకుండా జాగ్రత్తలు తీసుకొని, ఉగ్రవాద శిబిరాలను టార్గెట్ చేశారు. జైష్-ఎ-మొహమ్మద్ మరియు లష్కరే తోయిబాకు చెందిన లాంచ్ ప్యాడ్లను ధ్వంసం చేశారు.కర్నల్ సోఫియా మీడియా సమావేశంలో చూపిన వీడియోల్లో మురీద్కే, సియాల్కోట్, కోట్లి తదితర ప్రాంతాలలో ఉగ్ర శిబిరాలు ధ్వంసమైన దృశ్యాలు ఉన్నాయి. 2008 ముంబయి దాడికి పాల్పడిన డేవిడ్ హెడ్లీ, అజ్మల్ కసాబ్ శిక్షణ పొందిన ప్రాంతాలు కూడా ఇందులో ఉన్నాయి.
మాజీ అధికారుల, నేతల స్పందనలు
ఈ దాడిపై మాజీ ఆర్మీ చీఫ్ నరవణే "ఇది ట్రైలర్ మాత్రమే, ఫుల్ మూవీ ఇంకా ఉంది" అంటూ స్పందించారు. AIMIM అధినేత అసదుద్దీన్ ఒవైసీ కూడా భారత సైన్యాన్ని అభినందిస్తూ, "ఇకపై పాకిస్తాన్ ఎప్పటికీ పహల్గామ్ మాదిరి దాడి చేయలేని బుద్ధి తెచ్చుకోవాలి" అని ట్వీట్ చేశారు.దేశ భద్రత కోసం ప్రాణాలకూ భయపడకుండా ముందుంటున్న వీర సైనికుల్లో కర్నల్ సోఫియా కురేషి ఒక మేటి ఉదాహరణ. ఆమె చరిత్ర, సేవా పటిమ, సంకల్పం మనందరికీ గర్వకారణం.