WhatsApp: వాట్సాప్​.. తాజాగా ఏప్రిల్‌ నెలకు సంబంధించిన నివేదికను విడుదల చేసింది. ఒక్క ఏప్రిల్‌ నెలలోనే భారత్‌లో 16.6 లక్షల ఖాతాలను నిషేధించినట్టు వెల్లడించింది. కొత్త ఐటీ రూల్స్‌కు అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివ‌రించింది.   

WhatsApp: మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్‌ (WhatsApp) భారతీయులకు షాక్ ఇచ్చింది. నిబంధనలు అతిక్రమించిన వినియోగ‌దారుల అకౌంట్లపై చర్యలు తీసుకుంది. ఐటీ రూల్స్ 2021 ప్రకారం నెలవారి రిపోర్ట్‌ను వాట్సాప్‌ వెల్లడించింది. యూజర్ సేఫ్టీ మంత్లీ రిపోర్ట్‌లో ఈ వివరాలను పేర్కొంది. ఏప్రిల్ నెలలో 16.6లక్షలకు పైగా ఖాతాలను నిషేధించింది. మార్గదర్శకాలు, విధానాలను అనుసరించనందున ఈ ఖాతాలపై నిషేధం విధించిన‌ట్టు తెలిపింది. అలాగే వాట్సాప్‌ మెకానిజమ్ ద్వారా యూజర్లు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు కూడా చర్యలు తీసుకున్నట్టు తెలిపింది.

IT రూల్ 2021 ప్రకారం WhatsApp తన 11వ (ఏప్రిల్‌) సేఫ్టీ మంత్లీ రిపోర్ట్‌ను విడుదల చేసింది. తాజా నివేదిక ప్రకారం.. ఏప్రిల్‌లో వ్యాట్సాప్ యాప్ 16.6 లక్షలకు పైగా భారతీయ ఖాతాలు నిషేధించింది. ఈ ప్లాట్‌ఫారమ్ మార్గదర్శకాలను అనుసరించనందుకు, ఇతర కారణాల వల్ల ఈ ఖాతాలను నిషేధించిన‌ట్టు తెలిపింది.

ఈ సందర్భంలో, వాట్సాప్ ప్రతినిధి మాట్లాడుతూ.. 'ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్టెడ్ మెసేజింగ్ సర్వీస్‌లో దుర్వినియోగాన్ని నిరోధించడంలో వాట్సాప్ అగ్రగామిగా ఉంది. WhatsApp ప్లాట్‌ఫారమ్‌ను సురక్షితంగా ఉంచడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇతర అడ్వాన్స్‌డ్‌ మెషీన్‌ లెర్నింగ్‌ సిస్టమ్ ను ఉప‌యోగిస్తున్నాం.. డేటా శాస్త్రవేత్తలు, నిపుణులు ఈ ప్రక్రియలలో నిరంతరం నిమ‌గ్నమై ఉంటారని తెలిపారు. ఈ క్ర‌మంలో అపాయకర ఖాతాలను గుర్తించి, వాటిని తొలిగిస్తారని తెలిపారు. అనుమానిత ఖాతాల‌పై నెగటివ్‌ ఫీడ్‌బ్యాక్‌ వచ్చినపుడు.. ఇతరులు ఆ ఖాతాలను బ్లాక్‌ చేసినపుడు ఆ అకౌంట్‌ను పర్యవేక్షించి తగు కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

 ఇదిలా ఉండగా.. కొత్త ఐటీ నిబంధనలు- 2021 ప్రకారం.. 50లక్షలకుపైగా వినియోగ‌దారులున్న వాట్సాప్.. త‌న‌కు వ‌చ్చిన ఫిర్యాదులు, తీసుకున్న చర్యలపై నెలవారీగా ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది. ఇందులో భాగంగానే ఏప్రిల్‌ 1 నుంచి 30 వరకు WhatsApp రూల్స్‌కు విరుద్ధంగా ప్రవర్తించిన 16,66,000 ఖాతాలపై నిషేధం విధించినట్టు వాట్సాప్‌ తెలిపింది.

ఏ వాట్సాప్ ఖాతాల‌ను నిషేధించింది ?

సాధారణంగా వాట్సాప్ ఖాతాల నిషేధానికి కారణం కంపెనీ పాలసీలు, మార్గదర్శకాలను పాటించకపోవడమే. తప్పుడు సమాచారాన్ని పంచుకున్నందుకు కొన్ని ఖాతాలు నిషేధించబడ్డాయి. అదే సమయంలో.. ఒక సందేశాన్ని ధృవీకరించకుండా చాలా మంది వినియోగదారులకు ఫార్వార్డ్ చేసినందుకు, ఇతర కారణాల వల్ల కొందరి ఖాతాల‌ను నిషేధించిన‌ట్టు తెలిపింది. వాట్సాప్ ప్లాట్ ఫారమ్‌లో నకిలీ వార్తలను అరికట్టడానికి అనేక చర్యలు తీసుకుంది. నకిలీ వార్తలను నిరోధించడానికి యాప్ వెరిఫై ఎక్స్‌టర్నల్ లింక్, ఫార్వార్డెడ్ మెసేజ్ లేబుల్ వంటి అనేక దశలను తీసుకుంది. అలాగే.. వాట్సాప్‌లో ఇతరులకు పంపే మెసేజ్‌లను మళ్లీ ఎడిట్‌/రీ–రైట్‌ చేసే ఆప్షన్‌ త్వరలో అందుబాటులోకి రావచ్చు. ఇది ప్రస్తుతం పరీక్ష దశలో ఉంది.