మోడీ వద్దకు ఆరు బ్యాగులు తీసుకెళ్లారు .. వాటిలో ఏమున్నాయ్: యడియూరప్పపై కుమారస్వామి వ్యాఖ్యలు
కర్ణాటక సీఎం యడియూరప్ప ఢిల్లీ పర్యటనపై అనుమానాలు వ్యక్తం చేశారు జేడీఎస్ నేత కుమారస్వామి. ముఖ్యమంత్రి తనతో పాటు ఆరు బ్యాగుల్ని తీసుకెళ్లారని వాటిలో ఏమున్నాయంటూ ప్రశ్నించారు.
కర్ణాటక ముఖ్యమంత్రి బి.ఎస్. యడియూరప్పపై మాజీ సీఎం, జేడీఎస్ నేత హెచ్ డీ కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీతో యడియూరప్ప భేటీ తనలో ఎన్నో సందేహాలను కలుగజేసిందన్నారు. తనకున్న సమాచారం మేరకు మోడీతో భేటీకి యడియూరప్ప ఆరు బ్యాగులు తీసుకెళ్లారని.. ఆ బ్యాగుల్లో ఏమున్నాయ్?’’ అని కుమారస్వామి ప్రశ్నించారు. కర్ణాటక ఎదుర్కొంటున్న సమస్యల జాబితాల పత్రాలున్నాయా? లేదంటే మరేమైనా ఉన్నాయా? అని ఆయన నిలదీశారు. అయితే, మీడియా కథనాలు మాత్రం ఆ బ్యాగుల్లో ‘కానుక’లున్నాయంటూ చెబుతున్నాయని ఎద్దేవా చేశారు. ఆ బ్యాగులన్నింటినీ ప్రధాని మోడీకి యడియూరప్ప ఇచ్చారా? అని సందేహం వ్యక్తం చేశారు.
పార్టీ జిల్లాల కార్యకర్తలతో సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మూడు రోజులుగా జిల్లా స్థాయి సమావేశాలను నిర్వహిస్తున్నామని, జిల్లా పంచాయతీలు, తాలూకా పంచాయతీల ఎన్నికల్లో పోటీ చేస్తామని కుమారస్వామి స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ఇవి సెమీ ఫైనల్స్ లాంటివని ఆయన అభివర్ణించారు. మేకదాతు, మహాదయీ సమస్యలపై చర్చించేందుకు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ వస్తున్నారంటూ యడియూరప్ప చెప్పారని, కానీ, తీరా వచ్చాక ఆయన కేవలం జల్ జీవన్ మిషన్ ప్రాజెక్టుకు సంబంధించిన సమీక్షనే చేశారని కుమారస్వామి అసహనం వ్యక్తం చేశారు.