కోవాగ్జిన్ పై రాజకీయాలొద్దు: భారత్ బయోటెక్ ఎండీ కృష్ణ ఎల్లా
వ్యాక్సిన్ల అభివృద్దిలో తమ సంస్థకు సుదీర్ఘ అనుభవం ఉందని భారత్ బయోటెక్ సంస్థ ఛైర్మెన్, ఎండీ కృష్ణ ఎల్లా చెప్పారు
హైదరాబాద్: వ్యాక్సిన్ల అభివృద్దిలో తమ సంస్థకు సుదీర్ఘ అనుభవం ఉందని భారత్ బయోటెక్ సంస్థ ఛైర్మెన్, ఎండీ కృష్ణ ఎల్లా చెప్పారు.
భారత్ బయోటెక్ అభివృద్ది చేసిన కోవాగ్జిన్ విషయంలో కొందరు రాజకీయ నేతలు చేసిన విమర్శల నేపథ్యంలో ఆయన సోమవారం నాడు స్పందించారు. తమ డేటాలో పారదర్శకత లేదని జరగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు.
వ్యాక్సిన్ల అభివృద్దిలో తమకు సుదీర్ఘ అనుభవం ఉందని ఆయన స్పష్టం చేశారు. కోవాగ్జిన్ కు డీసీజీఐ అత్యవసర అనుమతులు మంజూరు చేసిందన్నారు.
ప్రపంచ ప్రఖ్యాత జర్నల్స్ లో భారత్ బయోటెక్ గురించి వ్యాసాలు ప్రచురితమైన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇప్పటివరకు 16 వ్యాక్సిన్లు తయారు చేశామన్నారు. 123 దేశాలకు తాము సేవలందిస్తున్నామని చెప్పారు.
కరోనా విషయంలో కేవలం దేశంలోనే కాదు యూకే సహా 12 దేశాల్లో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించామని తెలిపారు. తమిళనాడులోని రైతు కుటుంబం నుండి వచ్చిన తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని ఆయన చెప్పారు.
వ్యాక్సిన్ల విషయంలో మాకు గ్లోబల్ లీడర్ షిప్ ఉందన్నారు.వివిధ దేశాల్లో కూడ తమకు భాగస్వామ్యులున్నారని ఆయన చెప్పారు. ఈ వ్యాక్సిన్ వివరాలను పుణే ఎన్ఐవీ, ఐసీఎంఆర్ తో పంచుకొన్నామని ఆయన వివరించారు.
తమ ప్రయోగ పద్దతులను ఐసీఎంఆర్ ఆమోదించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కొత్త కరోనా వైరస్ స్ట్రెయిన్ పై కూడ తమ వ్యాక్సిన్ పనిచేస్తోందని ఆయన తేల్చి చెప్పారు.