West Bengal SSC Scam: పశ్చిమ బెంగాల్లోని టీచర్ రిక్రూట్మెంట్ స్కాం కేసులో కేబినెట్ మంత్రి పార్థ ఛటర్జీని ఈడీ శనివారం అరెస్టు చేసింది. ఈ క్రమంలో ఆయనను రెండు రోజుల పాటు రిమాండ్ తరలించాలని ఈడీ కోరగా.. కోర్టు అనుమతించింది.
West Bengal SSC Scam: పశ్చిమ బెంగాల్లో టీచర్ రిక్రూట్మెంట్ స్కాం ప్రకంపనలు కొనసాగుతున్నాయి. ఈ కుంభకోణంలో బెంగాల్ క్యాబినెట్ మంత్రి, రాష్ట్ర మాజీ విద్యాశాఖ మంత్రి పార్థ ఛటర్జీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) శనివారం అరెస్టు చేసింది. ఈ క్రమంలో పార్థ ఛటర్జీని రెండు రోజుల పాటు రిమాండ్ తరలించాలని ఈడీ కోర్టును ఆశ్రయించింది. ఈ విషయంలో కోర్టు ఆమోదం తెలపడంతో ఆయనను రెండు రోజుల పాటు ఈడీ రిమాండ్కు తరలించారు. .
అయితే.. పార్థ ఛటర్జీ తరపు న్యాయవాది సోమనాథ్ ముఖర్జీ.. తన క్లయింట్కు ఆరోగ్యం బాగోలేదని దీనిని వ్యతిరేకించారు. ఆయన గత కొత్తకాలగా ఛాతీ నొప్పితో బాధపడుతున్నాడని ఫిర్యాదు చేస్తున్నాడు. ఈ కేసును ఈడీ కస్టడీకి అప్పగిస్తే.. తన క్లయింట్కు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. దీంతో పార్థ ఛటర్జీని ED కస్టడీలో కోల్కతాలోని SSKM ఆసుపత్రికి తరలించనున్నారు.
ఈ కేసును కోల్కతాలోని బ్యాంక్షాల్ కోర్టులో మేజిస్ట్రేట్ నీలం శశి కుజుర్ విచారించారు. కానీ, పార్థ ఛటర్జీ మేజిస్ట్రేట్ ముందు హాజరు కాలేదు. మంత్రి పార్థ ఛటర్జీ తరపు న్యాయవాది ఈ వాదనలు వినిపించారు. పార్థ ఛటర్జీ తరపు న్యాయవాది అనింద్యా రౌత్ తన వాదన వినిపిస్తూ.. తన క్లయింట్ నివాసం నుంచి ఎలాంటి డబ్బు రికవరీ కాలేదని, అతడు క్యాబినేట్ మంత్రి కావడంతో అతడిని అరెస్టు చేసేందుకు ప్రత్యేక అనుమతి తీసుకోలేదన్నారు. ప్రాథమిక విచారణకు తన క్లయింట్ను పిలిచినప్పుడల్లా హాజరయ్యాడనీ, కానీ, ఈసారి అతనికి ఎటువంటి సమన్లు రాలేదన్నారు.
ఛటర్జీని శనివారం ఉదయం కస్టడీలోకి తీసుకుంటామని ED అధికారులు శుక్రవారం అర్థరాత్రి తనకు చెప్పినప్పటికీ, అరెస్టుకు సంబంధించిన పత్రాలను ఆయనకు అందజేయలేదని ఛటర్జీ తరపు న్యాయవాది అనింద్యా రౌత్ అంతకు ముందు మీడియాకు తెలిపారు. టీచర్ స్కామ్కు సంబంధించి అర్పితా ముఖర్జీ నివాసంతో సహా 14 చోట్ల ఏజెన్సీ సోదాలు నిర్వహించిందని, పార్థ ఛటర్జీని కస్టడీకి కోరుతూ ED కోర్టు ముందు పునరుద్ఘాటించింది. అర్పిత ఇంటి నుంచి రికవరీ చేసిన పత్రాలు, ఈ కేసులో ప్రమేయం ఉన్న రెండు పార్టీల మధ్య ప్రత్యక్ష సంబంధం, డబ్బు లావాదేవీలను రుజువు చేస్తున్నాయని ED తన వాదనలో పేర్కొంది.
ఈ వ్యవహారంలో ఇరుపక్షాల వాదనలు విన్న మేజిస్ట్రేట్ నీలం శశి కుజూర్ మాట్లాడుతూ.. ఇది ప్రత్యేక కేసు కాబట్టి.. ఈ కోర్టు పరిధిలోకి రాదు.. పార్థ ఛటర్జీని సోమవారం ఉదయం 10.30 గంటలకు ప్రత్యేక కోర్టులో హాజరుపరిచాలనీ, పార్థ ఛటర్జీని విచారించడానికి రెండు రోజుల డిమాండ్ పంపాలని ED డిమాండ్ ను కోర్టు ఆమోదించింది. మాజీ విద్యాశాఖ మంత్రిని రెండు రోజుల పాటు ఈడీ రిమాండ్కు పంపింది.
పశ్చిమ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్ (డబ్ల్యుబిఎస్ఎస్సి) రిక్రూట్మెంట్ అక్రమాల కుంభకోణంపై విచారణ జరుపుతున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ( ఈడీ) అధికారులు ఛటర్జీని అరెస్టు చేశారు. అతని అరెస్టు తర్వాత, ఛటర్జీని సాధారణ వైద్య పరీక్షల కోసం కోల్కతా లోని జోకాలోని కేంద్ర ప్రభుత్వ ESI ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆస్పత్రి నుంచి బయటకు వస్తున్న సమయంలో తొలిసారిగా మీడియాతో మాట్లాడిన ఛటర్జీ.. మమతా బెనర్జీని సంప్రదించలేకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. తనని ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలియడం లేదని పార్థ ఛటర్జీ అన్నారు. తాను మమతా బెనర్జీని సంప్రదించలేకపోయాననీ అన్నారు.
టీచర్ రిక్రూట్మెంట్ కుంభకోణంలో పశ్చిమ బెంగాల్ మంత్రి పార్థ ఛటర్జీ సన్నిహితురాలు అర్పితా ముఖర్జీ నివాసాలపై జరిపిన దాడుల్లో రూ.20 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం వెల్లడించింది. ఈ డబ్బుకు ఎస్ఎస్సీ స్కామ్తో సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్నట్లు ఈడీ ఒక ప్రకటనలో తెలిపింది. నగదును లెక్కించేందుకు దర్యాప్తు బృందం బ్యాంకు అధికారుల సాయం తీసుకుంటోంది.
టీచర్ రిక్రూట్మెంట్ స్కామ్పై విచారణకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారుల బృందం శుక్రవారం ఇద్దరు పశ్చిమ బెంగాల్ మంత్రులు - పార్థ ఛటర్జీ, పరేష్ అధికారి సహచరుల ఇళ్లపై దాడి చేసింది. ఈ సమయంలో అర్పితా ముఖర్జీ ప్రాంగణంలో 20కి పైగా మొబైల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నామని, వాటి ప్రయోజనం, ఉపయోగం గురించి నిర్ధారణ జరుగుతోందని ED తెలిపింది. ఛటర్జీతో పాటు విద్యాశాఖ సహాయ మంత్రి పరేష్ సి అధికారి, ఎమ్మెల్యే మాణిక్ భట్టాచార్య తదితరుల నివాసాలపై ఈడీ దాడులు చేసింది.
డబ్బు కవరుపై బెంగాల్ విద్యాశాఖ ముద్ర
అర్పితా ముఖర్జీ నివాసాలపై జరిపిన దాడుల్లో రూ.20 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నట్లు, అయితే.. రూ.500, రూ.2000 నోట్లను వేర్వేరు కవరుల్లో ఉంచామని, కొన్ని నోట్లపై రాష్ట్ర విద్యాశాఖ ముద్ర ఉందని ఈడీ అధికారి ఒకరు తెలిపారు. ఈ ఎన్వలప్లను మూడు వేర్వేరు బస్తాల్లోకి లోడ్ చేశారు, వీటిని అర్పితా ముఖర్జీ డైమండ్ పార్క్ హోమ్లోని అల్మారాలో తాళం, కీ కింద ఉంచారు. అవసరమైతే, ఛటర్జీని కోల్కతా వెలుపల ఎక్కడైనా ట్రాన్సిట్ రిమాండ్లో ఉంచడానికి, ప్రత్యేకంగా న్యూఢిల్లీలో సాఫీగా విచారణ జరిపేందుకు ED దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన అన్నారు.
