Nupur Sharma: నుపుర్ శర్మపై లుక్ ఔట్ నోటీసులు జారీ చేసిన కోల్కతా పోలీసులు
కోల్కతా పోలీసులు నుపుర్ శర్మ పై లుక్ ఔట్ నోలీసులు జారీ చేశారు. పశ్చిమ బెంగాల్లో నమోదైన ఎఫ్ఐఆర్ల దర్యాప్తు కోసం హాజరు కావాలని సమన్లు పంపారు. కానీ, వీటిని ఆమె ఉల్లంఘించడంతో లుక్ ఔట్ సర్క్యూలర్ జారీ చేశారు.
కోల్కతా: బీజేపీ మాజీ జాతీయ ప్రతినిధి నుపుర్ శర్మ పై లుక్ ఔట్ నోటీసులు జారీ అయ్యాయి. మహమ్మద్ ప్రవక్తపై ఓ టీవీ డిబేట్ లో చేసిన అభ్యంతరకర వ్యాఖ్యల వల్ల పశ్చిమ బెంగాల్లో రెండు చోట్ల ఎఫ్ఐఆర్ దాఖలు అయ్యాయి. ఈ నేపథ్యంలోనే కోల్కతా పోలీసులు నుపుర్ శర్మకు సమన్లు జారీ చేశారు. అయితే, ఈ సమన్లకు అనుగుణంగా ఆమె ప్రత్యక్షంగా కోల్కతాకు వచ్చి పోలీసుల ముందు హాజరు కాలేదు. ఈ కారణంగానే కోల్కతా పోలీసులు ఆమె పై లుక్ ఔట్ నోలీసులు జారీ చేశారు.
మహమ్మద్ ప్రవక్తపై నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యల కారణంగా పశ్చిమ బెంగాల్లో నర్కెల్దంగా పోలీసుల స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ పోలీసు స్టేషన్ నుంచి నుపుర్ శర్మకు సమన్లు జారీ అయ్యాయి. జూన్ 20న హాజరవ్వాలని ఆదేశాలు వెళ్లాయి. అలాగే, మరో ఎఫ్ఐఆర్ అమెరెస్ట్ పోలీసు స్టేషన్లో నమోదైంది. ఈ పోలీసు స్టేషన్ నుంచి కూడా జూన్ 25న హాజరవ్వాలని నుపుర్ శర్మకు సమన్లు వెళ్లాయి. ఈ రెండు సమన్ల ఆదేశాలను ఆమె స్కిప్ చేసింది. తనకు ప్రాణ హాని ఉన్నదని పేర్కొంటూ ప్రత్యక్షంగా హాజరు కాలేదు. ఈ నేపథ్యంలోనే కోల్కతా పోలీసులు లుక్ ఔట్ సర్క్యూలర్ జారీ చేశారు.
ఇటీవల నుపుర్ శర్మకు మద్దతుగా రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ కు చెందిన ఓ టైలర్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. దీని తరువాత అతడు దారుణ హత్య కు గురయ్యాడు. ఈ ఘటన దేశం మొత్తం సంచలనం సృష్టించింది. అయితే ఈ ఘటన మరక ముందే ఇలాగే నూపుర్ శర్మకు మద్దతు తెలిపిన మహారాష్ట్ర అమరావతికి చెందిన మరో వ్యక్తి కూడా హత్యకు గురయ్యాడని ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
మృతుడి పేరు ఉమేశ్ ప్రహ్లాద్ రావు కొల్హే. ఆయన అమరావతిలో వెటర్నరీ ఫార్మసిస్ట్ గా పని చేస్తుండేవారు. ఆయన నూపుర్ శర్మకు అనుకూలంగా కొంత కాలం కిందట ఫేస్ బుక్ లో ఓ పోస్ట్ పెట్టాడు. అతడు హత్యకు గురయ్యాడు. అయితే ఈ ఘటనపై విచారణ చేపట్టాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఎన్ఐఏ బృందాలు దర్యాప్తు కోసం మహారాష్ట్రలోని అమరావతికి వెళుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.