Asianet News TeluguAsianet News Telugu

ప్రత్యేక బడ్జెట్ ను నిలిపేసి రైల్వేలను బీజేపీ నాశనం చేసింది - పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైల్వేల కోసం ప్రవేశపెట్టే ప్రత్యేక బడ్జెట్ ను నిలిపివేసిందని, దీంతో ఆ రోజు నుంచే ఆ వ్యవస్థ నాశనమవడం మొదలుపెట్టిందని టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. . రైలు ప్రమాదం వెనుక ఉన్న వాస్తవాలను దాచిపెట్టడంలో బీజేపీ బిజీగా ఉందని అన్నారు. 

West Bengal CM Mamata Banerjee says BJP has destroyed railways by stopping special budget..ISR
Author
First Published Jun 9, 2023, 6:56 AM IST

ప్రత్యేక రైల్వే బడ్జెట్ ను ప్రవేశపెట్టే పద్ధతిని నిలిపివేసిన రోజే భారతీయ రైల్వేలు నాశనమయ్యాయని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై గురువారం విరుచుకుపడ్డారు. తాను రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు ఫైనాన్స్, ఎంప్లాయీ వెల్ఫేర్, సిగ్నలింగ్, ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ వంటి వివిధ రైల్వే శాఖలకు క్యాబినెట్ ర్యాంక్ కలిగిన ఆరుగురు కార్యదర్శులను నియమించుకునే అవకాశం ఉండేదని అన్నారు. వారు వివిధ శాఖల మధ్య సమన్వయంతో పనిచేశారని తెలిపారు. కానీ నేడు ఈ సమన్వయం పోయిందని చెప్పారు.

ఒడిశా రైలు విషాదం: ఒక వారం గడిచినా ఇంకా వివ‌రాలు తెలియ‌ని 82 మృతదేహాలు

ఈ మేరకు ఆమె గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘మీరు (బీజేపీ) విడివిడిగా బడ్జెట్ ప్రవేశపెట్టడం ఆపివేసిన రోజు భారతీయ రైల్వే నాశనమైంది. ఈ రోజుల్లో ఈ విషయాలను ఎవరూ పట్టించుకోవడం లేదు’’ అని తెలిపారు. జూన్ 2న ఒడిశాలో జరిగిన ట్రిపుల్ రైలు ప్రమాదంలో పశ్చిమ బెంగాల్ వాసులు సహా 288 మంది మృతి చెందిన నేపథ్యంలో టీఎంసీ అధినేత్రి ఈ ప్రకటన చేశారు. రైలు ప్రమాదం వెనుక ఉన్న వాస్తవాలను దాచిపెట్టడంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బిజీగా ఉందని మమతా బెనర్జీ ఆరోపించారు.

ఈ విషయాన్ని తాను గతంలోనే చెప్పానని, మరోసారి చెబుతానని అన్నారు. ప్రమాదానికి గల కారణాలపై నిజానిజాలు బయటకు రావాలని అన్నారు. అయితే నిజాన్ని ఎలా తారుమారు చేశారో చూశామని, ప్రమాదానికి అసలు కారణాన్ని కప్పిపుచ్చడానికి ఫేక్ కథనాలను సృష్టిస్తున్నారని ఆమె తెలిపారు. మణిపూర్ లో అశాంతిని ప్రస్తావిస్తూ.. వాస్తవాలను అణచివేసేందుకు కేంద్రం జర్నలిస్టులతో సహా ఎవరినీ ఈశాన్య రాష్ట్రంలో పర్యటించడానికి అనుమతించడం లేదని ఆరోపించారు.

అద్వానీ రథయాత్రను లాలు ప్రసాద్ ఆపినట్టే.. నితీశ్ కుమార్ కూడా...: తేజస్వీ యాదవ్

‘‘మణిపూర్ కు సంబంధించిన వార్తలను కేంద్ర ప్రభుత్వం ఎలా అణచివేస్తుందో చూశాం. జర్నలిస్టులు అక్కడకు వెళ్లి స్వేచ్ఛగా రిపోర్టు చేయడానికి వీల్లేదు. అందుకే ఈ ప్రభుత్వం వాస్తవాలను దాచిపెడుతోందని నేను చెబుతోంది నిజం. దేశప్రజలు ప్రభుత్వానికి సమాధానం చెబుతారు. ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నాను’’ అని అన్నారు.

ట్రిపుల్ రైలు ప్రమాద బాధితులకు నష్టపరిహారం చెల్లించడానికి భవన, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు నిధులను మళ్లించారని ఆరోపిస్తూ కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ రాష్ట్రానికి లేఖ రాసిందని వచ్చిన వార్తలపై మమతా బెనర్జీ స్పందించారు. ప్రజలకు సాయం అందించడమే తనకు ముఖ్యమన్నారు. ‘‘ఆ డబ్బు ఏ డిపార్ట్ మెంట్ నుంచి వచ్చిందో అర్థం కావడం లేదు. అయినా డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై దృష్టి పెట్టే బదులు పాజిటివ్ గా ఆలోచించాలి. నిధులన్నీ రాష్ట్ర ప్రభుత్వావే’’ అని తెలిపారు.

10 కోట్ల‌కు పైగా మధుమేహ వ్యాధిగ్రస్తులు.. నాలుగేళ్లలో 44% పెరుగుద‌ల‌: ఐసీఎంఆర్ స్టడీలో షాకింగ్ విష‌యాలు

బీజేపీ అబద్దాల పార్టీ అని, తప్పుడు కథనాలు సృష్టించే పార్టీ అని మమతా బెనర్జీ అన్నారు. మణిపూర్, ఉత్తర్ ప్రదేశ్ లలో జరుగుతున్న అరాచకాలపై మౌనంగా ఉన్నందుకు వారు (బిజెపి) సిగ్గుపడాలని తెలిపారు.  అనేక ప్రాజెక్టులు, పథకాల కోసం పశ్చిమ బెంగాల్ కు కేంద్ర ప్రభుత్వం నిధులు నిలిపివేసిందని ఆరోపించారు. 2024 లోక్ సభ ఎన్నికల తర్వాత కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరుతుందని, అప్పుడే ఈ సమస్యలు పరిష్కారమవుతాయని అన్నారు. కాగా.. నరేంద్ర మోడీ ప్రభుత్వం 2017 లో రైల్వే బడ్జెట్ ను కేంద్ర బడ్జెట్ లో విలీనం చేసింది. సుమారు 100 సంవత్సరాల ఆచారానికి ముగింపు పలికింది.

Follow Us:
Download App:
  • android
  • ios