Asianet News TeluguAsianet News Telugu

ఒడిశా రైలు విషాదం: ఒక వారం గడిచినా ఇంకా వివ‌రాలు తెలియ‌ని 82 మృతదేహాలు

Odisha train tragedy: ఒడిశా రైలు ప్రమాదం ఘోర విషాదాన్ని మిగిల్చింది. ఈ ప్ర‌మాదం జ‌రిగి వారం రోజులు గడుస్తున్నా ఇంకా అన్ని మృతదేహాల వివ‌రాలు గుర్తించ‌బ‌డ‌లేదు. 288 మృతదేహాల్లో 206 మృతదేహాలను గుర్తించామనీ, మిగిలిన 82 మృతదేహాలను గుర్తించి.. వారి కుటుంబాల‌కు అప్పగించడం ఇప్పుడు సవాలుగా మారిందని ఒడిశా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు తెలిపారు.
 

Odisha train accident: A week on, identifying bodies still a task,  82 bodies have not been identified RMA
Author
First Published Jun 9, 2023, 3:21 AM IST

Odisha train accident: ఒడిశా రైలు ప్రమాదం ఘోర విషాదాన్ని మిగిల్చింది. ఈ ప్ర‌మాదం జ‌రిగి వారం రోజులు గడుస్తున్నా ఇంకా అన్ని మృతదేహాల వివ‌రాలు గుర్తించ‌బ‌డ‌లేదు. 288 మృతదేహాల్లో 206 మృతదేహాలను గుర్తించామనీ, మిగిలిన 82 మృతదేహాలను గుర్తించి.. వారి కుటుంబాల‌కు అప్పగించడం ఇప్పుడు సవాలుగా మారిందని ఒడిశా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు తెలిపారు.

వివ‌రాల్లోకెళ్తే.. ఒడిశాలో జూన్ 2న కోరమాండల్ ఎక్స్ ప్రెస్ లో ప్రయాణిస్తున్న తన అన్న, ఇద్దరు మేనల్లుళ్ల గురించి ఆందోళన చెందుతున్న మహ్మద్ తన్వీర్ ఆలం ఈ వారం ప్రారంభంలో హైదరాబాద్ నుంచి ఒడిశాకు వెళ్లారు. గూడ్స్ రైలును ఢీకొనడం, కోర‌మాండ‌ల్ బోగీలు పట్టాలు తప్పడం, యశ్వంత్ పూర్ హౌరా ఎక్స్ ప్రెస్ ను ఢీకొనడంతో 288 మంది మరణించగా, 1100 మందికి పైగా గాయపడ్డారు. అయితే, ఆలం ఈ ప్ర‌మాదంలో త‌న అన్నయ్య, ఒక మేనల్లుడి మృతదేహాన్ని కనుగొన్నాడు. వారి మృత‌దేహాల‌ను అధికారులు ఆయ‌న‌కు అప్ప‌గించారు. అయితే, ఇంకా త‌న 14 సంవత్సరాల మ‌రో మేనల్లుడి మృతదేహం గుర్తించ‌డం కోసం క‌ష్ట‌ప‌డుతున్నారు. భువనేశ్వర్ లోని ఎయిమ్స్ మార్చురీలో ఉన్న మరో నాలుగు కుటుంబాలు ఒకే మృతదేహంపై వాద‌న‌లు చేస్తుండ‌టం ఆలంకు సమస్యను సృష్టించిందని హిందుస్తాన్ టైమ్స్ నివేదించింది. అంటే.. ఈ ప్ర‌మాదంలో చ‌నిపోయిన వారి మృత‌దేహాలు గుర్తించ‌డానికి వీలులేకుండా ఉండ‌టంతో పాటు ఇంకా తమ ప్రియమైన వారి కోసం వెతుకుతూ క‌న్నీరు పెట్టుకుంటున్న వారి సంఖ్య పెద్ద‌గానే ఉంద‌ని అక్క‌డి ప‌రిస్థితులు చూస్తే తెలుస్తోంది. 

మూడు దశాబ్దాలలో భారతదేశంలో అత్యంత ఘోరమైన రైలు ప్రమాదం జరిగిన వారం తరువాత, ఒడిశా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు 288 మృతదేహాలలో 206 మృతదేహాలను గుర్తించామనీ, అయితే మిగిలిన 82 మృతదేహాలను సరిగ్గా గుర్తించి.. వారి కుటుంబాల‌కు అప్పగించడం ఇప్పుడు పెరుగుతున్న సవాలుగా మారింద‌ని చెప్పారు. శవాగారంలో మిగిలిపోయిన మృతదేహాలే కాదు.. చాలా సందర్భాల్లో సరైన కుటుంబాలుగా భావించిన ఇళ్లకు పంపిన మృత‌దేహాల విష‌యంలో ఇత‌రులు త‌మ‌వారిద‌ని వ‌స్తున్న ఘ‌ట‌న‌లు కూడా ఉన్నాయ‌ని స‌మాచారం.  పశ్చిమ బెంగాల్ లోని కూచ్ బెహర్ కు చెందిన సిబకాంత రాయ్ (22) తన కుమారుడు బిపుల్ రాయ్ మృతదేహాన్ని బిహార్ కు చెందిన ఓ కుటుంబం తీసుకెళ్లి దహనం చేసిందని చెప్పారు. "ప్రమాదం జరిగినప్పుడు నేను అరుణాచల్ ప్రదేశ్ లో ఉన్నాను. నేను బాలాసోర్ కు వెళ్లాను, అక్కడ నేను చనిపోయిన జాబితాలో నా కుమారుడి ఫోటోను గుర్తించాను. ఎయిమ్స్ లో త‌న కుమారుడి మృతదేహాన్ని బీహార్ కు చెందిన ఓ కుటుంబం తీసుకెళ్లిందని నాకు చెప్పారు' అని రాయ్ తెలిపారు. 

ఇలాంటి స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం డీఎన్ఏ పరీక్ష ఒక్కటేన‌ని అధికారులు తెలిపారు. ఢిల్లీలో పరీక్షలు చేస్తున్నామనీ, ఫలితాలు రావడానికి ఏడు నుంచి పది రోజులు పడుతుందని చెప్పారు. డీఎన్ఏ శాంపిల్స్ సరిపోలిన తర్వాతే మృతదేహాన్ని అప్పగిస్తామని భువనేశ్వర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ విజయ్ అమృత కులంగే తెలిపారు. గురువారం సాయంత్రానికి బీఎంసీ 57 డీఎన్ఏ నమూనాలను పరీక్షలకు పంపింది. ఇదిలావుండ‌గా, వేస‌వి సెల‌వులు పూర్త‌యిన త‌ర్వాత తరగతులు పునఃప్రారంభమైనప్పుడు పిల్లలు ఆ భవనానికి తిరిగి వస్తారని ఆందోళన వ్యక్తం చేస్తున్నందున చనిపోయిన వారి మృతదేహాలను భద్రపరిచిన మొదటి ప్రదేశమైన బహనాగా హైస్కూల్లోని విభాగాలను కూల్చివేయవచ్చని బాలాసోర్ జిల్లా అధికారులు తెలిపారు. బాలాసోర్ జిల్లా కలెక్టర్ దత్తాత్రేయ భౌసాహెబ్ షిండే మాట్లాడుతూ పాఠశాల నిర్వహణ కమిటీ సభ్యులు, ప్రధానోపాధ్యాయురాలు, ఇతర సిబ్బంది, స్థానికులతో సమావేశమయ్యారు. పిల్లలు తరగతులకు హాజరయ్యేందుకు ఎలాంటి భయం, భయాందోళనలు లేకుండా పాత భవనాన్ని కూల్చివేసి పునరుద్ధరించాలని కోరుతున్నార‌ని చెప్పారు.

Follow Us:
Download App:
  • android
  • ios