గాల్వన్ ఘర్షణ: ఆ రాత్రి నుంచి నేటి వరకు జరిగిన పరిణామాలు ఇవి
ఇండో చైనా బోర్డర్లోని గాల్వన్ లోయ వద్ద గత సోమవారం రాత్రి భారత్- చైనా బలగాల మధ్య జరిగిన ఘర్షణలో 20 మంది జవాన్లు అమరవీరులైన సంగతి తెలిసిందే.
ఇండో చైనా బోర్డర్లోని గాల్వన్ లోయ వద్ద గత సోమవారం రాత్రి భారత్- చైనా బలగాల మధ్య జరిగిన ఘర్షణలో 20 మంది జవాన్లు అమరవీరులైన సంగతి తెలిసిందే. అటు చైనా వైపు నుంచి కూడా సుమారు 43 మంది సైనికులు కూడా మరణించినట్లు అంతర్జాతీయ సంస్థలు అంచనా వేస్తున్నాయి (ఇంకా చైనా ధ్రువీకరించాల్సి ఉంది).
ఆ రోజు రాత్రి నుంచి నేటి వరకు ఇవాళ్టీ వరకు జరిగిన పరిణామాలను ఒకసారి పరిశీలిస్తే. భారత్- చైనా సరిహద్దు వెంట గత కొన్ని రోజులుగా స్వల్ప ఉద్రిక్తతలు చేసుకుంటున్నాయి. అయితే ఈ నెల మొదటి వారంలో అవి మరింత తీవ్రమయ్యాయి.
ఈ నేపథ్యంలో జూన్ 6వ తేదీన లెఫ్టినెంట్ జనరల్ స్థాయి అధికారుల మధ్య చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా గాల్వన్ లోయలో నిర్మించిన తాత్కాలిక చెక్పోస్టులను తొలగించడానికి, చైనా అంగీకరించింది.
అయితే చైనా ఎంతమేరకు తన మాట నిలబెట్టుకుందో చూసేందుకు కల్నల్ సంతోష్ బాబు నేతృత్వంలోని 40 మంది జవాన్లు జూన్ 15న సాయంత్రం గాల్వన్ లోయలోకి వెళ్లారు. ఈ క్రమంలో భారత భూభాగంలో చైనా సైన్యం అబ్జర్వేషన్ పోస్ట్ నిర్మించినట్లు గుర్తించారు.
అంతేకాకుండా అక్కడ తనకు తెలిసిన చైనా సైనికులు కాకుండా కొత్త ముఖాలు ఉండటాన్ని సంతోష్ గుర్తించారు. దీంతో డ్రాగన్ దేశం.. అదనపు బలగాలను మోహరించిందని పసిగట్టిన సంతోష్ బాబు అక్కడి నిర్మాణాలను తొలగించాలని సూచించారు.
అదే సమయంలో ఓ సైనికుడు మాండరిన్ భాషలో దూషిస్తూ సంతోష్ను బలంగా వెనక్కి తోశారు. తమ దళపతిపై చైనా సైనికుడు చేయి చేసుకోవడాన్ని సహించలేకపోయిన భారత బలగాలు చైనా సైన్యంపై దాడికి దిగాయి.
ఈ క్రమంలో అరగంట పాటు ఇరు వర్గాలు తలపడటంతో ఇరువైపులా సైనికులు గాయపడ్డారు. ఈ ఘర్షణలో తీవ్రంగా గాయపడినప్పటికీ అక్కడి నుంచి వెనక్కి వెళ్లకుండా గాయపడిన సైనికుల స్థానంలో అదనపు బలగాలను రప్పించారు.
ఆ కాసేపటికే చైనా సైనికులు భారీగా అక్కడికి చేరుకున్నారు. ఆ తర్వాత కొద్దిసేపటికే చైనా సైనికులు భారీ సంఖ్యలో మేకులున్న ఇనుప రాడ్లు, కర్రలు, రాళ్లతో దాడికి దిగారు. రాత్రి 9 గంటల ప్రాందంలో సంతోష్ బాబు తలకు గాయం కావడంతో ఆయన గాల్వన్ నదిలో పడిపోయారు.
దీంతో భారత జవాన్లలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అంతే చైనా సైన్యాన్ని ధీటుగా ఎదుర్కొన్నారు. ఘర్షణ ముగిసిన తర్వాత కల్నల్ సంతోష్తో పాటు ఇరు దేశాలకు చెందిన సైనికుల మృతదేహాలు గాల్వన్ నదిలో పడిపోయాయి.
ఈ విషయం క్షణాల్లో దేశం మొత్తం వ్యాపించింది. తొలుత ముగ్గురు మాత్రమే చనిపోయినట్లు వార్తలు వచ్చినప్పటికీ.. అర్థరాత్రి నాటికి 20 మంది జవాన్లు చనిపోయినట్లు భారత సైన్యం ప్రకటించింది.
వీరోచితంగా పోరాడి అమరుడైన కల్నల్ సంతోష్ బాబు పార్థీవ దేహాన్ని లేహ్ నుంచి ఆయన స్వస్థలం సూర్యాపేటకు తరలించారు. అనంతరం వేలాది మంది ప్రజల అశ్రునయనాల మధ్య సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.
అనంతరం సంతోష్ బాబు కుటుంబాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పరామర్శించి.. వారికి రూ.5 కోట్ల నగదుతో పాటు హైదరాబాద్ జూబ్లీహిల్స్లో నివాస స్థలం కేటాయించారు. కల్నల్ సతీమణి సంతోషికి కోరుకున్న శాఖలో గ్రూప్ 1 కేటగిరీ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు.
మరోవైపు ఇరు దేశాల మధ్య ఘర్షణల నేపథ్యంలో సరిహద్దుల్లో భారత్- చైనాలు భారీగా బలగాలను మోహరించాయి. పర్వత ప్రాంతాల్లో యుద్ధంలో అపార అనుభవం వున్న మౌంటేన్ ఆర్మీని భారత సైన్యం రంగంలోకి దిగింది.
ఇదే సమయంలో గాల్వన్ లోయలో భారత్-చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలతో చోటు చేసుకొన్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు రెండు దేశాలకు చెందిన కమాండర్ స్థాయి అధికారుల చర్చలు ఫలప్రదమయ్యాయి.
తూర్పు లడఖ్ తో పాటు రెండు దేశాల మధ్య ఘర్షణలు చోటు చేసుకొనే అవకాశాలు ఉన్న అన్ని ప్రాంతాల్లో కూడ వెనక్కి వెళ్లేందుకు రెండు దేశాల ఆర్మీ అధికారులు సానుకూలంగా స్పందించారు. తమ దేశానికి సరిహద్దున మోహరించిన పిఎల్ఏ బంకర్లు, పిల్ బాక్స్లు, ఇతరత్రా వాటిని వెంటనే తొలగించాలని చైనాను ఇండియా డిమాండ్ చేసింది.