ఈ నెల 18 వరకు పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరికలు
Heavy rainfall: అక్టోబర్ 18 వరకు దేశంలోని అనేక రాష్ట్రాల్లో మోస్తారు నుంచి భారీ వర్షపాతం నమోదు కానుందని భారత వాతారణ విభాగం (ఐఎండీ) అంచనా వేసింది. ఈ వారం ప్రారంభం నుంచి పలు ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయని తెలిపింది.
IMD weather update: దేశంలోని చాలా ప్రాంతాల్లో ఇప్పటికే ఎడతెరిపి లేకుండా వానలు దంచికొడుతున్నాయి. దీంతో నీటి ఎద్దడి, వరదల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ వారం ప్రారంభం నుంచి కొనసాగుతున్న వానలు మరిన్ని రోజులు కొనసాగనున్నాయని సమాచారం. అక్టోబర్ 18 వరకు దేశంలోని అనేక రాష్ట్రాల్లో భారీ వర్షపాతం నమోదుకానుందని భారత వాతారణ విభాగం (ఐఎండీ) అంచనా వేసింది. చాలా ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
వివరాల్లోకెళ్తే.. దేశంలోని పలు ప్రాంతాల్లో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని సమాచారం. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తన తాజా బులెటిన్ లో రాబోయే మూడు రోజుల వాతావరణ అంచనాలను విడుదల చేసింది. ఇటీవలి వాతావరణ సూచన ప్రకారం, రాబోయే మూడు రోజుల్లో పరిస్థితులు మెరుగుపడే అవకాశం ఉంది. దీని వల్ల నైరుతి రుతుపవనాలు మధ్య భారతదేశంలోని మిగిలిన ప్రాంతాలు, మహారాష్ట్ర, తూర్పు భారతదేశంలోని కొన్ని అదనపు ప్రాంతాలు, ఈశాన్య భారతదేశంలోని ప్రాంతాల నుండి రుతుపవనాలు బయలుదేరే అవకాశం ఉంది. ఇదే సమయంలో దేశంలోని పలు ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.
ఐఎండీ వెల్లడించిన వివరాల ప్రకారం.. దేశంలోని పలు రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో అక్టోబరు 18 వరకు భారీ వర్షంతో కూడిన వర్షపాతం నమోదుకానుంది. మరో మూడు రోజులు వర్షాలు కురిసే ప్రాంతాల్లో తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్, కేరళ, అండమాన్ నికోబార్ దీవులు, మాహేలో వంటి ప్రాంతాలు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో 18న చాలా విస్తృతంగా తేలికపాటి నుండి మోస్తరు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. లక్షద్వీప్ మీదుగా మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని అంచనా
దక్షిణ ఇంటీరియర్ కర్ణాటకలో అక్టోబర్ 17న అక్కడక్కడ భారీ వర్షాలు, ఉరుములతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. అక్టోబరు 16న ఉత్తర అంతర్భాగమైన కర్ణాటకలో చాలా విస్తారంగా తేలికపాటి నుండి మోస్తరు వర్షపాతం, కొన్నిచోట్ల బలమైన వర్షాలు-ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తుంది. మరోవైపు, అక్టోబర్ 14, 15 తేదీలలో తెలంగాణ, కోస్టల్ కర్నాటకలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంతకుముందు ఐఎండీ వెల్లడించింది. శుక్రవారం నాడు మధ్య మహారాష్ట్ర, మరాఠ్వాడా, కోస్తా ఆంధ్ర ప్రదేశ్, రాయలసీమ, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి.
వాయువ్య భారతం నుంచి రుతుపవనాల ఉపసంహరణ..
పక్షం రోజుల ఆలస్యం తర్వాత, నైరుతి రుతుపవనాలు శుక్రవారం మొత్తం వాయువ్య భారతదేశం ప్రాంతం నుండి ఉపసంహరించుకున్నాయి. అక్టోబర్ 1 నుంచి 13 వరకు ఈ ప్రాంతంలో 58.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది సాధారణం కంటే 366 శాతం ఎక్కువ. అక్టోబర్ 7న ఉత్తర మహారాష్ట్ర మీదుగా ఏర్పడిన తుపాను దక్షిణ గుజరాత్, ఈశాన్య రాజస్థాన్, దక్షిణ హర్యానా, పంజాబ్ మీదుగా కదులుతూ వాయువ్య భారతదేశం, ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలో ప్రభావం చూపడంతో ఐదు రోజుల పాటు వర్షాలు కురిశాయి. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్ పాటు మధ్యప్రదేశ్లోని చాలా ప్రాంతాలు, బీహార్, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల నుంచి రుతుపవనాలు ఉపసంహరించుకున్నాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అధికారులు తెలిపారు.