Shimla : 'కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయాన్ని మేం అంగీకరిస్తున్నాం. హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా సుఖ్వీందర్ సింగ్ ఎన్నికను గౌరవిస్తున్నామని ఆ పార్టీ సీనియర్ నాయకులు ప్రతిభా సింగ్ అన్నారు. ఇదివరకు ఆమె హిమాచల్ సీఎం రేసులో ఉన్నవారిలో ఒకరుగా ఉన్నారు.
Congress high command: హిమాచల్ ప్రదేశ్ తదుపరి ముఖ్యమంత్రిగా సుఖ్వీందర్ సింగ్ సుఖును కాంగ్రెస్ ప్రకటించింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు ప్రతిభా సింగ్ హైకమాండ్ నిర్ణయాన్ని అంగీకరిస్తున్నానని చెప్పారు. శనివారం జరిగిన కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సీఎల్పీ) సమావేశం నుంచి బయటకు వచ్చిన ప్రతిభా సింగ్ విలేకరులతో మాట్లాడుతూ, "కాంగ్రెస్ హైకమాండ్ తీసుకున్న నిర్ణయాన్ని మేము అంగీకరిస్తున్నాము" అని అన్నారు. సీఎల్పీ సమావేశం అనంతరం హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ మాజీ చీఫ్ సుఖ్వీందర్ సింగ్ సుఖును పార్టీ అధిష్టానం ముఖ్యమంత్రిగా ఎన్నుకుంది.
వివరాల్లోకెళ్తే.. ఇటీవల జరిగిన హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో జయకేతనం ఎగురవేసినప్పటికీ రాష్ట్ర అత్యున్నత పదవి ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉండటంతో సమస్యను ఎదుర్కొంది. సీఎం పదవి కోసం పోటీలో ఉన్నవారు అందరూ కాంగ్రెస్ హై కమాండ్ నిర్ణయాన్ని అంగీకరిస్తామని చెప్పారు. శనివారం నాడు రాష్ట్ర నాయకులు భేటీ అయ్యారు. సీఎల్పీ సమావేశంలో హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ మాజీ చీఫ్ సుఖ్వీందర్ సింగ్ సుఖును పార్టీ అధిష్టానం ముఖ్యమంత్రిగా ఎన్నుకుంది. కాంగ్రెస్ నేత ముఖేష్ అగ్నిహోత్రిని ఉప ముఖ్యమంత్రిగా నియమించారు. ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు ప్రతిభా సింగ్, సిఎంగా నియమితులైన సుఖ్వీందర్ సింగ్ సుఖు, భూపేష్ బాఘేల్, కాంగ్రెస్ రాష్ట్ర ఇంచార్జ్ రాజీవ్ శుక్లా, నాయకుడు భూపిందర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
సుఖ్వీందర్ సింగ్ సుఖు ముఖ్యమంత్రిగా నియమితుడవుతారని ఊహాగానాలు వచ్చిన తరువాత, మాజీ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ భార్య ప్రతిభా సింగ్ మద్దతుదారులు బయటకు వచ్చి కేంద్ర పరిశీలకులు బస చేసిన హోటల్ సమీపంలో నినాదాలు చేశారు. అంతకుముందు శుక్రవారం కూడా ప్రతిభా సింగ్ మద్దతుదారులు కాంగ్రెస్ సిమ్లా ప్రధాన కార్యాలయం వెలుపల పెద్ద సంఖ్యలో గుమిగూడి ఆమెను రాష్ట్ర ముఖ్యమంత్రిగా నియమించాలని డిమాండ్ చేశారు. ప్రతిభా సింగ్ గతంలో రాంపూర్ బుషహర్ రాజకుటుంబంలో వివాహం చేసుకున్నందున ముఖ్యమంత్రి "రాణి సాహిబా" లాగా ఉండాలని వారు అన్నారు. గత ఏడాది కన్నుమూసిన వీరభద్ర సింగ్ పలు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు. తన దివంగత భర్త వారసత్వం, ప్రజలలో అతని సద్భావన రాష్ట్రంలో కాంగ్రెస్ విజయానికి ప్రధాన కారణమని ప్రతిభా సింగ్ చెప్పారు.
రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 40 సీట్లు గెలుచుకుంది. ప్రతిభా సింగ్ ముఖ్యమంత్రి పదవి రేసులో ఉన్నప్పటికీ కాంగ్రెస్ హై కమాండ్ సుఖ్వీందర్ సింగ్ సుఖు వైపు మొగ్గుచూపింది.
