దూకుడు పెంచిన కాంగ్రెస్.. కర్నాటకలో ఒంటరిగానే ఎన్నికల బరిలోకి.. మార్చి 20న అభ్యర్థుల జాబితా
Karnataka Election 2023: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ మార్చి 20న ఎన్నికల బరిలో నిలిపే అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేయనుందని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. అలాగే, రాష్ట్రంలో ఏ పార్టీలతోనూ పొత్తులు పెట్టుకోబోమని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ స్పష్టం చేశారు.

Karnataka Assembly Election 2023: కర్నాటక అసెంబ్లీకి ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో రాష్ట్రంలోని అన్ని ప్రధాన పార్టీలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాయి. నువ్వా నేనా అనే తరహాలో విమర్శల దాడులతో రాజకీయాలను హీటెక్కుస్తున్నాయి. అయితే, రానున్న ఎన్నికల్లో గెలుపు తమదేనని కాంగ్రెస్ పార్టీ ధీమా వ్యక్తం చేస్తోంది. గెలుపు కోసం వ్యూహాత్మక ప్రణాళికలతో ముందుకు సాగుతున్న కాంగ్రెస్.. ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తుందనీ, ఈ నెలలోనే అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తామని తెలిపింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ మార్చి 20న ఎన్నికల బరిలో నిలిపే అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేయనుందని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. అలాగే, రాష్ట్రంలో ఏ పార్టీలతోనూ పొత్తులు పెట్టుకోబోమని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ స్పష్టం చేశారు.
కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) సమావేశం అనంతరం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో 224 స్థానాలకు గాను 110 స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ఖరారు చేసింది. ఈ నెల 20వ తేదీ తర్వాత తొలి జాబితాను పార్టీ విడుదల చేయనుంది. ఇందులో నాలుగైదు స్థానాలు మినహా సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ టిక్కెట్లు ఇవ్వనున్నట్టు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఎస్డీపీఐతో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేస్తారా అన్న ప్రశ్నకు సీఈసీ సమావేశం అనంతరం కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ సమాధానమిస్తూ తాము ఎవరితోనూ పొత్తు పెట్టుకోవడం లేదని తెలిపారు. ఒంటరిగానే పోటీ చేస్తామని స్పష్టం చేశారు. "మేం ఒంటరిగానే వచ్చాం, ఒంటరిగా పోరాడి గెలుస్తాం. సీఈసీ సమావేశానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ హాజరయ్యారు" అని తెలిపారు.
డీకే శివకుమార్ ఇంకా ఏమన్నారంటే..?
కర్నాటక అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగేందుకు కాంగ్రెస్ టికెట్ కోసం 1300 మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారని, వారు చాలా తీవ్రమైన పోటీదారులని తెలిపారు. వారందరికీ టిక్కెట్లు ఇవ్వలేకపోతున్నామనీ, కేవలం 224 మంది అభ్యర్థులు మాత్రమే ఉన్నారని డీకే శివకుమార్ శుక్రవారం (మార్చి 17) సమావేశానికి ముందు చెప్పారు. యువతరానికి, ఎక్కువ మంది మహిళలకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు వెల్లడించారు.
మార్చి 20 బెళగావిలో రాహుల్ గాంధీ భారీ ర్యాలీ..
ఈ నెల 20న కర్ణాటకలోని బెళగావిలో రాహుల్ గాంధీ భారీ ర్యాలీ నిర్వహిస్తారని డీకే. శివకుమార్ తెలిపారు. అలాగే, కాంగ్రెస్ సీనియర్ అగ్ర నాయకులతో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నట్టు తెలిపారు. ఎన్నికల హామీలను గురించి ప్రస్తావిస్తూ.. తాము అధికారంలోకి వస్తే 'గృహజ్యోతి' కింద అన్ని కుటుంబాలకు నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, గృహ లక్ష్మి కింద ప్రతి కుటుంబ పెద్దకు నెలకు రూ.2,000 సాయం అందిస్తామని చెప్పారు. వీటితో పాటు 'అన్న భాగ్య' కింద దారిద్య్ర రేఖకు దిగువన నివసిస్తున్న కుటుంబంలోని ప్రతి సభ్యుడికి నెలకు 10 కిలోల ఉచిత బియ్యం అందిస్తామని తెలిపారు.